Begin typing your search above and press return to search.

AMB -2 ముచ్చట్లు.. మహేష్‌ కు థ్యాంక్యూ

By:  Tupaki Desk   |   24 Aug 2021 4:56 AM GMT
AMB -2 ముచ్చట్లు.. మహేష్‌ కు థ్యాంక్యూ
X
కరోనా కారణంగా ఎన్నో రంగాలు కుంటుపడ్డాయి. సినిమా ఇండస్ట్రీ కూడా భారీగా నష్టపోయింది. దాదాపుగా రెండేళ్లు పూర్తిగా తూడ్చుకు పెట్టుకు పోయినట్లే. కరోనా కారణంగా కొన్ని వందల సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌ కనుమరుగయ్యే పరిస్థితి. ఏదో మాదిరిగా నెట్టుకు వస్తున్న థియేటర్లు కాస్త ఇప్పుడు కరోనా వల్ల నెలలకు నెలలు మూత పడి ఉండటం వల్ల పూర్తిగా దెబ్బ తిన్నాయి. వాటిని కూల్చి వేసి మాల్స్ ను.. అపార్ట్‌మెంట్స్ ను కడుతున్న ఈ సమయంలో కొత్త థియేటర్లు మల్టీ ప్లెక్స్ అనేవి దాదాపుగా అసాధ్యం అంటున్నారు. దేశ వ్యాప్తంగా కొన్ని వందల థియేటర్లు ఇప్పటికే మూత పడ్డాయి. కరోనా పూర్తిగా పోయే వరకు మరెన్ని థియేటర్లు మూత పడుతాయో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో టాలీవుడ్‌ సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు కొత్త మల్టీ ప్లెక్స్ ను తీసుకు వచ్చేందుకు సిద్దం అవ్వడం సినీ అభిమానులకు సంతోషం కలిగిస్తుంది.

హైదరాబాద్‌ కీర్తికి తగ్గట్లుగా అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో మహేష్‌ బాబు ఏఎంబీ సినిమాస్‌ మల్టీప్లెక్స్ ను ఇప్పటికే తీసుకు వచ్చారు. సిటీకి కాస్త దూరంగా ఉన్నా కూడా ఏఎంబీకి దక్కిన ఆధరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా సమయంలో ఏఎంబీ మల్టీప్లెక్స్ చాలా నెలల వరకు మూత పడింది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఓపెన్‌ అవుతుంది. ఈ సమయంలో మరో ఏఎంబీని తీసుకు వచ్చేందుకు మహేష్‌ సిద్దం అయ్యారు. నానక్‌ రామ్‌ గూడాలో ఈ భారీ మల్టీ ప్లెక్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు అనేది అందరికి తెల్సిన విషయమే. ఈ మల్టీ ప్లెక్స్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం ఉన్న ఏఎంబీ కంటే రెట్టింపు హంగులను ఏఎంబీ 2 కలిగి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం అత్యధిక సీటింగ్ సామర్థ్యం ఉన్న మల్టీ ప్లెక్స్ గా ఏఎంబీ 1 రికార్డు సృష్టించింది. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఏఎంబీ 2 ఉండబోతుంది. అత్యధిక సీటింగ్ కేపాసిటీతో పాటు అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా ఈ కొత్త మల్టీ ప్లెక్స్ ను తీసుకు రాబోతున్నారు అంటూ సమాచారం అందుతోంది. ప్రస్తుతం నానక్‌ రామ్ గూడా మల్టీప్లెక్స్ కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

వచ్చే ఏడాది నుండి పూర్తి స్థాయిలో మహేష్‌ ఏఎంబీ సినిమాస్ 2 అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మహేష్‌ బాబు మరో మల్టీప్లెక్స్‌ ను ప్రేక్షకులకు అందించినందుకు చాలా మంది ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి సర్కారు వారి పాట రాబోతుంది. సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను.. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను మహేష్‌ బాబు చేయబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది.