Begin typing your search above and press return to search.

శిరీష్ ప్ర‌శంస‌లు..అల్లు అర‌వింద్ చుర‌క‌లు!

By:  Tupaki Desk   |   21 Oct 2022 7:30 AM GMT
శిరీష్ ప్ర‌శంస‌లు..అల్లు అర‌వింద్ చుర‌క‌లు!
X
అల్లు శిరీష్ నుంచి సినిమా వ‌చ్చి దాదాపు రెండేళ్లు దాటుతోంది. మ‌ల‌యాళంలో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన'ఏబీసీడీ : అమెరికన్ రిట‌ర్న్ క‌న్ఫ్యూజ్డ్ దేసీ' మూవీకి సీక్వెల్ గా తెర‌కెక్కిన'ఏబీసీడీ' మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. 2019 మే లో విడుద‌లైన ఈ మూవీ త‌రువాత‌ శిరీష్ కొంత విరామం తీసుకుని చేసిన రొమాంటిక్ ల‌వ్ స్టోరీ'ఊర్వ‌శివో రాక్ష‌సివో'. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీకి'విజేత‌' ఫేమ్ రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

జీఏ2 పిక్చ‌ర్స్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ధీర‌జ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఈ నేప‌థ్య‌వంలో ఈ మూవీ న‌వంబ‌ర్ 4న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. రీసెంట్ గా మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ని కూడా ప్రారంభించేశారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో ముచ్చ‌టించిన అల్లు శిరీష్ త‌న‌కు, హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కు మధ్య ఏదో వుందంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంపై క్లారిటీ ఇచ్చారు.

న‌టీన‌టుల జీవితాల్లో ఇలాంటి వ‌దంతులు స‌ర్వ‌సాధార‌ణం. కోస్టార్ తో తాను ప్రేమ‌లో వున్న‌ట్టు వార్త‌లు రావ‌డం స‌హ‌జ‌మే. గ‌తంలోనూ నా గురించి ఇలాంటి వార్త‌లే వ‌చ్చాయి. నిజం చెప్పాలంటే మా ఇద్ద‌రి మ‌ధ్య అలాంటిది ఏమీ లేదు. మేమిద్ద‌రం మంచి స్నేహితులం. కొన్ని నెల‌ల పాలు క‌లిసి ప‌ని చేశాం కాబ‌ట్టి మా ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది. అదీకాక తను చాలా సైలెంట్‌. మా ఇద్ద‌రి వ్య‌క్తిత్వాలు ఒకేలా వుంటాయి. దాని వ‌ల్ల మేమిద్ద‌రం ఎక్క‌వ‌గా మాట్లాడుకోవ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డింది.

వ‌ర్క్ విష‌యంలో త‌ను చాలా ప్రొఫెష‌నల్ గా వుంటుంది. అందువ‌ల్లే రొమాంటిక్ సీన్స్ చేసేట‌ప్పుడు ఇబ్బందిప‌డ‌లేదు' అంటూ అనుపై ప్ర‌శంస‌లు కురిపించాడు. అయితే రీసెంట్ గా జ‌రిగిన ఈ మూవీ ఈవెంట్ లో అల్లు అర‌వింద్ భిన్నంగా స్పందించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సినిమా రిలీజ్ కు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ ని మొద‌లు పెట్టిన చిత్ర బృందం తాజాగా హైద‌రాబాద్ లో మీడియాలో ముచ్చ‌టించింది. ఈ కార్య‌క్ర‌మంలో అల్లు శిరీష్, చిత్ర బృందంతో పాటు అల్లు అర‌వింద్ కూడా పాల్గొన్నారు.

అయితే హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మాత్రం ఆల‌స్యంగా అంటే మీడియా స‌మావేశానికి ఆల‌స్యంగా వ‌చ్చింది. త‌న కోసం ఎదురు చూసిన టీమ్ చేసేది లేక ప్రెస్ మీట్ ని మొద‌లు పెట్టేశారు. అల్లు అర‌వింద్ మాట్లాడుతున్న స‌మ‌యంలో అను ఇమ్మాన్యుయేల్ ఎంట్రీ ఇవ్వ‌డంతో ఆయ‌న‌కు మండిన‌ట్టుగా తెలిసింది.

ఈవెంట్ ఎండింగ్ లో త‌ను వ‌స్తోంద‌ని, ఇంకాస్త ఆల‌స్యంగా వ‌స్తే ఈవెంట్ అయిపోయేదంటూ చుర‌క‌లంటించాడు. దీంతో త‌నకు చుర‌క‌లంటిస్తున్నార‌ని గ్రహించిన అను త‌న‌కు చెప్ప‌డ‌మే ఈ టైమ్ చెప్పార‌ని వివ‌ర‌ణ ఇచ్చింది.

అయితే ఆ విష‌యాన్ని కూడా మీడియా ముఖంగా వెల్ల‌డించిన అల్లు అర‌వింద్ ఈ ఇష్యూని మ‌రింత సీరియ‌స్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. చెప్పిన వ్య‌క్తిదే త‌ప్ప‌ని అను అంటోంద‌ని వ్యంగ్యంగా మాట్లాడటంతో అంతా శిరీష్ ప్ర‌శంస‌లు కురిపిస్తే అల్లు అర‌వింద్ ఏంటీ ఇలా చుర‌క‌లు అంటిస్తున్నాడు.. ఏం జ‌రుగుతోంది? అని ఆరా తీస్తున్నార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.