Begin typing your search above and press return to search.

అగ్ర బ్యాన‌ర్ ఫోటోకి దండేసి పూజ‌లు చేసిన బ‌న్ని ఫ్యాన్స్!

By:  Tupaki Desk   |   31 March 2021 4:30 AM GMT
అగ్ర బ్యాన‌ర్ ఫోటోకి దండేసి పూజ‌లు చేసిన బ‌న్ని ఫ్యాన్స్!
X
మ‌న స్టార్ హీరోల‌ ఫ్యాన్స్‌ కి కోపం వ‌స్తే ఆప‌త‌రమా? అంత ఈజీ కాదు. ఇంత‌కుముందు అయితే థియేట‌ర్ టికెట్ క్యూలో.. లేదా గోడ పోస్ట‌ర్ పై పిడ‌క‌లు వేసి కోపం ప్ర‌ద‌ర్శించేవారు. కానీ ఇప్పుడు ఆ అవ‌కాశం లేకుండా పోవ‌డంతో సోష‌ల్ మీడియాల్లో ర‌క‌ర‌కాలుగా కోపాన్ని ప్ర‌దర్శిస్తున్నారు.

ఒక టాలీవుడ్ అగ్ర బ్యాన‌ర్ కి దండేసి ధూపం వేసిన ఈమోజీల్ని షేర్ చేసి హ్యాష్ ట్యాగ్ ల‌తో వైర‌ల్ చేస్తూ నానా ర‌చ్చ చేసిన వైనం తాజాగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఔరా! ఇదేమి కోపం? అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారంతా. ఇంత‌కీ ఎవ‌రి అభిమానుల కోప‌మిది... ఏ బ్యాన‌ర్ పై ఈ కోపం? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ లాంచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్న బ‌న్ని అభిమానులు సోష‌ల్ మీడియాలో మైత్రి మూవీ మేక‌ర్స్ పై అలా కోపాన్ని ప్ర‌ద‌ర్శించారు. చాలా కాలంగా ప్రొడక్షన్ హౌస్ నుండి ఎటువంటి స‌మాచారం రాలేదు. ఏప్రిల్ 8న‌ అల్లు అర్జున్ పుట్టినరోజు. గ‌డువు స‌మీపిస్తోంది.. ఇంకెంతో స‌మ‌యం లేదు. కానీ ఇంకా మైత్రి నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో బ‌న్ని అభిమానుల కోపం తారా స్థాయికి చేరింది.

పుష్ప కి సంబంధించిన అప్ డేట్ కోరుతూ కోపంతో ఉన్న అభిమానులు ట్విట్టర్ లో # వేక్ ఆప్ మైత్రి మూవీ మేకర్స్ అనే హ్యాష్ ‌ట్యాగ్ ను ప్రారంభించారు. అల్లు అర్జున్ పుట్టినరోజున ఎట్టిప‌రిస్థితిలో మైత్రి నుండి పుష్ప‌ టీజర్ రావాల్సిందేన‌ని బ‌న్ని డై హార్డ్ అభిమానులు ఆశిస్తున్నారు. అందుకే ఇలా కోపం ప్ర‌ద‌ర్శించారు.

దీనికి మైత్రి మూవీ మేకర్స్ స్పందిస్తూ మూడు స్మైల్ ఎమోజీ ల‌ను షేర్ చేసింది. అస‌లు ఎలాంటి అప్ డేట్ చెప్ప‌క‌పోగా ఇలా స్మైల్ ఈమోజీల్ని షేర్ చేసి స‌రిపుచ్చుతారా? అంటూ అభిమానులకు మరింత చికాకు ప‌డుతున్నారు. కొంతమంది అభిమానులు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సంస్కారాలు చేసినట్లుగా మైత్రి మూవీ మేకర్స్ లోగోకు దండలు వేసి దానిని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేశారు. అయితే బ‌న్ని పుట్టిన‌రోజున టీజ‌ర్ ని లాంచ్ చేసి మైత్రి సంస్థ ఆ కోపాన్ని చ‌ల్లారిస్తే కానీ ఈ హ్యాష్ ట్యాగ్ ఉద్య‌మం దండ‌లతో ప్రార్థ‌న‌లు ఆగేట్టు లేదు.