Begin typing your search above and press return to search.

జ్వరంతో ఆసుపత్రికి వెళితే..హీరోయిన్ కు లక్ష బిల్లు!

By:  Tupaki Desk   |   22 Aug 2019 10:52 AM GMT
జ్వరంతో ఆసుపత్రికి వెళితే..హీరోయిన్ కు లక్ష బిల్లు!
X
ఐశ్వర్య రాజేశ్.. పేరు పెద్దగా విన్నట్లు లేదు కదా? ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న కౌసల్య కృష్ణమూర్తిలో నటించారు. కోలీవుడ్ లో ఆమె చేసిన చిత్రాలు ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాయి. ఈ భామ ప్రత్యేకత ఏమంటే.. నటిగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న ఆమె చేతిలో ప్రస్తుతం 14 చిత్రాలు ఉన్నాయి. అంత బిజీగా ఉన్న ఆమె నటించిన తమిళ సినిమా మేయ్ విడుదలకు సిద్ధమైంది.

ఈ సినిమా కథాంశం ఏమంటే.. వైద్య వృత్తిలో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. ఇటీవల తనకు మామూలు జ్వరం వస్తే.. తానో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లానని.. వైద్యం కోసం జాయిన్ కావాలని చెప్పారన్నారు.

తర్వాతి రోజు నార్మల్ గా ఉండటంతో తనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని కోరితే.. ఆదివారం డిశ్చార్జ్ చేయటం సాధ్యం కాదని చెప్పేశారన్నారు. కొన్ని పరీక్షలు జరిపిన వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజు తన చేతికి రూ.లక్ష బిల్లు వేసినట్లుగా చెప్పారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేటప్పుడు జ్వరానికి అందరూ వాడే డోలా ట్యాబెట్లను చేతిలో పెట్టారని.. ఈ వ్యవహారం తనకు షాకింగ్ గా మారిందన్నారు. ఒక సెలబ్రిటీ విషయంలోనే వైద్యులు ఇలా వ్యవహరిస్తే.. మిగిలిన వారి సంగతేమిటి? అన్నది ఒక ప్రశ్న. ఇంత షాకింగ్ విషయాన్ని చెప్పిన ఐశ్వర్య.. సదరు ఆసుపత్రి పేరు చెప్పి పుణ్యం కట్టుకుంటే బాగుండేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.