Begin typing your search above and press return to search.

తిరిగి 'మేజర్' సెట్స్ లో అడుగుపెట్టిన వర్సటైల్ యాక్టర్..!

By:  Tupaki Desk   |   23 Oct 2021 8:30 AM GMT
తిరిగి మేజర్ సెట్స్ లో అడుగుపెట్టిన వర్సటైల్ యాక్టర్..!
X
యువ హీరో అడవి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ''మేజర్''. ముంబై 26/11 ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన ఎన్ఎస్జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే మేజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చివరి దశలో ఉంది. ఈరోజు శనివారం పెండింగ్ పోర్షన్ చిత్రీకరణ మొదలు పెట్టినట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ఈ సందర్భంగా అడివి శేష్ ట్వీట్ చేస్తూ.. ''మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అనే నా ప్రయాణం దాదాపు పూర్తయింది. ఈ షెడ్యూల్ తర్వాత, నేను అతని ఆరాధకుడిగా తిరిగి వెళ్తాను. అతన్ని బాగా అర్థం చేసుకున్న అభిమానిని. తనలో మేజర్ సందీప్ ని కనుగొనడానికి ప్రయత్నించిన అభిమాని'' అని పేర్కొన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన శేష్.. చికిత్స తీసుకుని బయటపడ్డారు. ఈ క్రమంలో తిరిగి ''మేజర్'' సెట్స్ లో అడుగుపెట్టారు.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'మేజర్' చిత్రానికి అడివి శేష్ కథ - స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేయనున్నారు.

'మేజర్' చిత్రంలో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల - బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అబ్బూరి ఈ చిత్రానికి రవి సంభాషణలు రాస్తున్నారు.