Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేసు నుండి 'ఆది పురుష్' అవుట్?.. కారణం అదేనా?

By:  Tupaki Desk   |   31 Oct 2022 4:12 AM GMT
సంక్రాంతి రేసు నుండి ఆది పురుష్ అవుట్?.. కారణం అదేనా?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ''ఆదిపురుష్''. రామాయణ ఇతిహాస కావ్యం ఆధారంగా బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టీ-సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి.

'ఆదిపురుష్' చిత్రాన్ని 2023 జనవరి 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అప్పుడెప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమా చెప్పిన తేదీకి రావడం లేదని.. వచ్చే ఏడాది సమ్మర్ కు పోస్ట్ పోన్ అవుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ వారంలో అధికారికంగా ధృవీకరిస్తారని అంటున్నారు.

ఇటీవల 'ఆదిపురుష్' టీజర్ కు మిశ్రమ స్పందన వచ్చిన నేపథ్యంలో.. వీఎఫ్ఎక్స్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి సమయం అవసరమని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాని వాయిదా వేయడానికి అసలు కారణం వేరే ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సంక్రాంతి పండక్కి మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి' వంటి భారీ సినిమాలను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందించబడ్డాయి.

అలానే కోలీవుడ్ స్టార్ విజయ్ తో దిల్ రాజు తీస్తున్న 'వారసుడు' సినిమా కూడా అప్పుడే రిలీజ్ కాబోతోంది. ఇలా బడా బ్యానర్ల నుంచి వస్తోన్న మూడు పెద్ద చిత్రాల కారణంగా 'ఆదిపురుష్' వాయిదా పడుతోందని అంటున్నారు.

'ఆది పురుష్' సినిమా తెలుగు రాష్ట్రాల నుంచి భారీ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మూడు నాలుగు పెద్ద సినిమాలు పోటీ పడితే.. అధిక స్క్రీన్స్ లో రిలీజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇది ఖచ్చితంగా ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పాలి.

అందులోనూ 'ఆదిపురుష్' అనేది పాన్ ఇండియా చిత్రం. హిందీలో జనవరిలో మరో సినిమా రిలీజ్ లేదు కాబట్టి.. ప్రభాస్ కు కలిసొస్తుంది. కానీ దక్షిణాదిలో గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తోంది. తమిళ్ లో విజయ్ 'వారసుడు' తో పాటుగా అజిత్ కుమార్ 'తునివు' చిత్రం కూడా థియేటర్లలోకి వస్తోన్న సంగతి తెలిసిందే.

దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'ఆదిపురుష్' లాంటి చిత్రానికి భారీ స్థాయిలో వసూళ్ళు రావాలంటే.. సంక్రాంతి క్లాష్ అనేది సరైనది కాదని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే సోలో రిలీజ్ కోసం ప్రస్తుతానికి 2023 సమ్మర్ కు వాయిదా వేయనున్నారని అంటున్నారు.

మరోవైపు ప్రభాస్ చిత్రాన్ని వాయిదా వేసుకోడానికి టాలీవుడ్ లోని 'పెద్ద' నిర్మాతలే ప్రధాన కారణమని.. ఇందులో కోసం 'ఆదిపురుష్' మేకర్స్ ను ఒప్పించారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

కారణాలు ఏవైతేనేం 'ఆదిపురుష్' సినిమా ఈ సంక్రాంతి రేసు నుంచి అవుట్ అయిందని ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ లో టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా శ్రీరామ నవమి పండుగ సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై త్వరలోనే మేకర్స్ నుంచి క్లారిటీ వస్తుందేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.