Begin typing your search above and press return to search.

గూఢచారి ఆ రోజు వస్తాడు

By:  Tupaki Desk   |   16 Jun 2018 6:20 AM GMT
గూఢచారి ఆ రోజు వస్తాడు
X
‘క్షణం’ సినిమా వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. టాలీవుడ్ బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచిన ఈ చిత్రంతో అడివి శేష్ పేరు మార్మోగింది. ఈ చిత్రానికి అతను హీరో మాత్రమే కాదు.. కథా రచయిత కూడా. స్క్రీన్ ప్లే సహకారం కూడా అందించాడు. ఆ చిత్ర విజయంలో అతడిది కీలక పాత్ర. దీని తర్వాత శేష్ నటించే సినిమా కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అతను మాత్రం తాపీగా ఉంటున్నాడు. ‘క్షణం’ వచ్చిన ఏడాది తర్వాత కానీ హీరోగా తన తర్వాతి సినిమా ‘గూఢచారి’ని మొదలు పెట్టలేదు. మొదలయ్యాక కూడా చాలా లేటు చేస్తున్నాడు. అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ లాంచ్ చేసి.. తర్వాత పత్తా లేకుండా పోయాడు. ఈ సినిమా గురించి జనాలు మరిచిపోయే పరిస్థితి వచ్చింది. ఐతే ఎట్టకేలకు ‘గూఢచారి’ షూటింగ్ ముగించి.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు శేష్.

ఆగస్టు 3న ‘గూఢచారి’ ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించాడు శేష్. ఇదొక స్పై థ్రిల్లర్. శేష్ ఇందులో గూఢచారిగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి కూడా అతనే కథ అందించడం విశేషం. శశికిరణ్ తిక్క దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డిస్ట్రిబ్యూటర్ టర్న్ డ్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్నందించాడు. ఇందులో శేష్ సరసన తెలుగమ్మాయే అయిన బాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల కథానాయికగా నటించింది. ఆమెకిదే తొలి తెలుగు సినిమా. హీరోయిన్‌తో పాటు ఇంకా చాలామంది తెలుగు నటీనటులు ఈ చిత్రంలో నటించారని శేష్ అంటున్నాడు. దర్శకుడిగా ‘కర్మ’.. ‘కిస్’ అనే రెండు సినిమాలు తీసిన శేష్ వాటితో ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఐతే కొత్త దర్శకుడిని పెట్టుకుని తన కథతో తీసిన ‘క్షణం’తో మెప్పించాడు. ఇదే కోవలో ‘గూఢచారి’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.