Begin typing your search above and press return to search.

35 ఏళ్ల చిరుప్రాయంలో ప్రముఖ నటి కన్నుమూత

By:  Tupaki Desk   |   10 Aug 2021 3:23 AM GMT
35 ఏళ్ల చిరుప్రాయంలో ప్రముఖ నటి కన్నుమూత
X
వయసులో పెద్దదేం కాదు. ఆ మాటకు వస్తే.. జీవితాన్ని ఒక వంతు మాత్రమే చూసింది. కానీ.. అప్పటికే కాలాతీతం అయిపోయినట్లుగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది ప్రముఖ మలయాళ నటి శరణ్య శశి. అభినయంతో అందరికి ఆకట్టుకున్న ఆమె.. మంత్రకోడి.. సీత.. హరిచందనంతో సహా పలు మలయాళ టీవీ సీరియల్స్ లో నటించిన ఆమె బాగా పాపులర్. పలు చిత్రాల్లో సహాయక పాత్రల్ని పోషించిన ఆమె.. కొన్నేళ్ల క్రితమే క్యాన్సర్ బారిన పడ్డారు.

దాదాపు పదేళ్ల క్రితం ట్యూమర్ ఉన్నట్లు గురతించారు. అప్పటి నుంచి ఆమెకు పదకొండు పెద్ద శస్త్రచికిత్సలు చేశారు. దీంతో ఆమె తీవ్రమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బందులకు గురయ్యారు. ఈ సమయంలో ఆమెకు మలయాళ పరిశ్రమ నుంచి సాయం అందింది. పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం చేశారు. ఇలాంటివేళలోనే అనూహ్యంగా కరోనా ఆమెను సోకింది.

దీంతో శరణ్య మరింత అనారోగ్యానికి గురయ్యారు. న్యూమోనియాతో పాటు రక్తంలో సోడియం స్థాయిలు పడిపోవటంతో కొన్నిరోజుల పాటు కేరళలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికి ఇతర అనారోగ్య సమస్యలు ఆమెను వెంటాడాయి. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో.. ఆమె సోమవారం త్రివేండంలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. చిన్న వయసులోనే అనారోగ్య కారణాలతో కన్నుమూసిన వైనం పలువురిని విషాదంలో ముంచెత్తింది.