Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ హీరోగా రైజ్ అవుతున్న మంగ‌ళం శ్రీ‌ను

By:  Tupaki Desk   |   24 Feb 2022 3:30 PM GMT
మ‌ళ్లీ హీరోగా రైజ్ అవుతున్న మంగ‌ళం శ్రీ‌ను
X
టాలీవుడ్ లో స్టార్ క‌మెడియ‌న్ గా సునీల్ కున్న ప్ర‌త్యేక‌త వేరు. క‌మెడియ‌న్‌గా కొన‌సాగిన సునీల్ హీరోగా ట‌ర్న్ తీసుకుని మ‌ళ్లీ ఇప్ప‌డు కీల‌క‌మైన విల‌న్ పాత్ర‌ల్లో న‌టిస్తూ రాణిస్తున్నారు. అయితే మ‌రోసారి హీరోగా అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నార‌ని తెలుస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే.. స్టార్ క‌మెడియ‌న్ గా పేరు తెచ్చుకున్న సునీల్ ఒక ద‌శ‌లో స్టార్ అప్ క‌మింగ్ హీరోల నుంచి క్రేజీ స్టార్ హీరోల చిత్రాల్లో న‌టించి క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపి స్టార్ క‌మెడియ‌న్ గా ఓ వెలుగు వెలిగాడు. హాస్య న‌టుడిగా త‌న‌దైన మార్కు పాత్ర‌ల్లో న‌టించి సీరియ‌స్ గా కామెడీ చేస్తూనే క‌డుపుబ్బా న‌వ్వించి త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ని చాటుకున్నారు.

స్టార్ క‌మెడియ‌న్ గా క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న రోజుల్లోనే స‌డ‌న్ గా `అందాల రాముడు` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ స‌క్సెస్ కావ‌డంతో హీరోగా న‌టించాల‌ని సీరియ‌స్‌గా నిర్ణ‌యించుకున్నారు.

ఆ త‌రువాత చేసిన `మ‌ర్యాద రామ‌న్న‌` కూడా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో సునీల్ కేవ‌లం హీరోగా న‌టించ‌డానికే ప్రాధాన్య‌తనిస్తూ క‌మెడియ‌న్ గా క్రేజీ ఆఫ‌ర్లు వ‌చ్చినా వాటిని సున్నితంగా తిర‌స్క‌రిస్తూ వ‌చ్చారు.

అయితే టైమ్ మారింది.. సునీల్ కెరీర్ హీరోగా త‌ల‌కింద‌లైంది. అనుకున్న ప‌సినిమా ఏదీ ఆ త‌రువాత స‌క్సెస్ కాలేదు.. వ‌రుస‌గా భారీ ఫ్లాపులు వ‌రించాయి.

దీంతో మ‌ళ్లీ ట్రాక్ మార్చారు. త్రివిక్ర‌మ్ చేసిన `అర‌వింద స‌మేత‌`తో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా క‌మెడియ‌న్ గా క‌నిపించారు. ఆ త‌రువాత వ‌చ్చిన క‌ల‌ర్ ఫొటో, డిస్కోరాజా వంటి చిత్రాల్లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా విల‌న్ పాత్ర‌ల్లో క‌నిపించి షాకిచ్చారు.

అయితే సునీల్ కు ఇటీవ‌ల `పుష్ప‌` చిత్రంలో న‌టించిన మంగ‌ళం శ్రీ‌ను పాత్ర మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా ఫ‌స్ట్ పార్ట్ లో సునీల్ అద‌ర‌గొట్టాడ‌ని చెప్పొచ్చు. విచిత్ర‌మైన మేకోవ‌ర్ తో పాత్ర‌కు త‌గ్గ ఆహార్యంతో సునీల్ క‌నిపించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది.

పార్ట్ 2 లోనూ సునీల్ క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమా అందించిన స‌క్సెస్ తో అంతా సునీల్ ఇక విల‌న్ వేశాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిన‌ట్టే అని అనుకున్నారు. సునీల్ మాత్రం హీరో వేషాల‌ని అంత తేలిగ్గా విడిచిపెట్ట‌డం లేదు. మ‌ళ్లీ హీరోగా స‌త్తా చాటాల‌ని మ‌రో ప్ర‌య‌త్నానికి శ్రీ‌కారం చుట్టాడు.

ఇంత‌కు ముందు సునీల్ హీరోగా వేదాంతం రాఘ‌వ‌య్య‌, మ‌ర్యాద కృష్ణ‌య్య చిత్రాలు ప్ర‌క‌టించారు. ఇవి లాంఛ‌నంగా ప్రారంభం అయ్యాయి కూడా. అయితే వీటితో పాటు మ‌రో సినిమాని కూడా ప‌ట్టాలెక్కించాడు సునీల్‌. అదే `కుంభ‌క‌ర్ణ‌`.

ఓ విభిన్న‌మైన క‌థ‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నార‌ట‌. రామాయ‌ణంలో రావ‌ణుడి సోద‌రుడైన కుంభ‌కర్ణుడు నిత్యం నిద్ర‌పోతూనే వుంటాడు. అత‌న్ని లేప‌డానికి పెద్ద పెద్ద ఏనుగుల‌ని ర‌ప్పించి నిద్ర లేపే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. కుంభ‌క‌ర్ణుడు నిద్ర‌పోకుండా వుండ‌లేడు. అయితే సునీల్ సినిమా అలా కాదు ఈ కుంభ‌క‌ర్ణుడు నిద్ర‌పోతే మాత్రం పోతాడ‌ట‌. ఇలాంటి విభిన్న‌మైన క‌థ‌తో రూపొందుతున్న చిత్రం `కుంభ‌క‌ర్ణ‌`.

ఈ చిత్రంతో అభిరామ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సాయి కార్తిక్ సంగీతం అందించ‌డంతో పాటు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌బీర్ దుహ‌న్ సింగ్ విల‌న్ గా న‌టిస్తున్నాడు. `ప‌డుకుంటే పోతాడు` అనే ట్యాగ్ టైన్ తో ఈ మూవీ రూపొంద‌నుంది. ఈ సినిమాతో హీరోగా సునీల్ కెరీర్ మ‌రో మ‌లుపు తిరుగుతుందేమో చూడాలి.