Begin typing your search above and press return to search.

సిద్ధార్థ్ మ‌రో ప్ర‌కాష్ రాజ్ అట‌!

By:  Tupaki Desk   |   25 July 2018 4:26 PM GMT
సిద్ధార్థ్ మ‌రో ప్ర‌కాష్ రాజ్ అట‌!
X
పశువులను కబేలాకు తరలిస్తున్నారనే ఆరోపణలపై రక్బర్ ఖాన్ అనే వ్యక్తిపై అల్వార్ జిల్లాలో సామూహిక దాడి చేసిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ దాడి అనంతరం గోవుల‌తో పాటు ర‌క్బ‌ర్ ను గోశాల‌కు తీసుకువెళ్లి....ఆ త‌ర్వాత ఆసుప‌త్రికి తీసుకువెళ్లే స‌రికి అత‌డు చ‌నిపోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో ఆ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు పోలీసులను స‌స్పెండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఆ ఘ‌ట‌న‌పై ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ చేసిన ట్వీట్ కు కేంద్రమంత్రి రాజ్య‌వ‌ర్థ‌న్ సింగ్ రాథోడ్ ఘాటుగా రీట్వీట్ చేశారు. దీంతో, రాథోడ్ ట్వీట్ పై త‌మిళ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ఇపుడు వైర‌ల్ అయింది. రాథోడ్ తోపాటు బీజేపీ - ఆరెస్సెస్ ల‌పై కామెంట్స్ చేసిన సిద్ధూపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

``ఓ మనిషిని దారుణంగా చావబాదారా? ఈ ఘ‌ట‌న గోరక్షకులకు - పశువులకు సంబంధించిందా? ఆసుప‌త్రికి తీసుకెళ్లడానికి ముందు ఆ వ్య‌క్తిని గోశాలకు తీసుకెళ్లారా? ఆ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం అవును అయితే....ఈ వ్యవహారంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారు. ఇక ఆ వ్య‌క్తి విష‌యంలో న్యాయం జ‌ర‌గ‌డం అనేది క‌ల్ల‌. మిస్టర్ రాథోడ్ (కేంద్రమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్) మీ తీరు బాగాలేదు. నీవో పిరికివాడివి`` అని సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. దీంతో, సిద్ధూ ట్వీట్లపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. బుర్రలో ఏది అనిపిస్తే అది ట్వీట్ చేయ‌డం మానుకోవాల‌ని - బాధ్యతారాహిత్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఇలాంటి ఘటనలు కర్ణాటక - కేరళ - పశ్చిమ బెంగాల్ - పంజాబ్‌ లో కూడా జరిగాయని...అపుడు ఎందుకు స్పందించ‌లేద‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఓ నన్‌ (క్రైస్తవ సన్యాసి)పై బిషప్ లైంగిక దాడి చేశాడ‌ని - యువకులతో ముస్లిం బాబా అసహజసిద్ధంగా సెక్స్ చేశాడ‌ని...అపుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నావ‌ని ప్ర‌శ్నించారు. సిద్ధూ మరో ప్రకాష్ రాజ్ అంటూ ట్రోల్ చేశారు.