Begin typing your search above and press return to search.

సాయిపల్లవి వల్లనే 'ఫిదా'లో ఫాదర్ పాత్రను చేశాడట!

By:  Tupaki Desk   |   21 March 2021 5:30 AM GMT
సాయిపల్లవి వల్లనే ఫిదాలో ఫాదర్ పాత్రను చేశాడట!
X
నటుడు సాయిచంద్ పేరు ఈ తరం కుర్రాళ్లకు పెద్దగా తెలియదు. 'ఫిదా' సినిమా కోసం ఎక్కడి నుంచో కొత్త ఆర్టిస్టును పట్టుకొచ్చారని అనుకున్నా ఆశ్చర్యం లేదు. కానీ ఆయన తెలంగాణ నేపథ్యంలో 40 ఏళ్ల క్రితమే వచ్చిన 'మా భూమి' సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించారు. సాయిచంద్ చేసిన సినిమాలు చాలా తక్కువ. వాటిలో ఉద్యమభావాలు కలిగిన కథలు .. తిరుగుబాటు ధోరణి కలిగిన పాత్రలు ఎక్కువ. 'శివ' .. 'అంకురం' సినిమాల వరకూ చేసి, ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అలా చాలా గ్యాప్ తరువాత ఆయన 'ఫిదా' సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన 'ఫిదా' సినిమాను గురించి మాట్లాడుతూ .. " నా 60వ పుట్టినరోజున నాకు ఒక కాల్ వచ్చింది. "నేను శేఖర్ కమ్ముల .. దర్శకుడిని .. మీరు సాయిచంద్ గారేనా?" అని అడిగారు. నేను ఔనని చెప్పగానే తాను ఒక సినిమా చేస్తున్నట్టుగా చెప్పి, అందులో హీరోయిన్ కి తండ్రి పాత్రలో చేయాలని అన్నారు. తెలంగాణ యాసలో ఆ పాత్ర సాగుతుందని చెప్పారు. నిజానికి నేను పెళ్లి చేసుకోలేదు .. పిల్లలు లేరు .. కనుక తండ్రిగా ఆ పాత్రను చేయలేనేమోనని అన్నాను. ఆ పాత్రను నేను తప్పకుండా చేయగలనని శేఖర్ కమ్ముల అన్నారు. ఆయనను స్వయంగా కలిసి నో చెప్పాలని నిర్ణయించుకున్నాను.

అయితే శేఖర్ కమ్ములగారిని కలిసిన తరువాత ఆయన నా పాత్రను గురించి వివరించారు. ఆ తరువాత నా కూతురుగా చేసేది సాయిపల్లవి అని చెప్పారు. అప్పటికి నేను ఆ అమ్మాయి సినిమా ఒక్కటి కూడా చూడలేదు. కానీ ఆ అమ్మాయి ఫొటో చూడగానే చేస్తానని అన్నాను. రిహార్సల్స్ రోజునే నాకు .. సాయిపల్లవికి మధ్య తండ్రీకూతుళ్లుగా ఒక మంచి బాండింగ్ ఏర్పడింది. ఒక రోజున తను నాకు స్వయంగా భోజనం వడ్డించింది .. నాన్న అంటూ నన్ను హత్తుకుపోయింది. అప్పటి నుంచి ఆమె నా కూతురైపోయింది. సాధారణంగా సినిమా అనేది హిట్ గానీ .. ఫ్లాప్ గాని ఇస్తుంది. కానీ 'ఫిదా' నాకు హిట్ తో పాటు సాయిపల్లవి వంటి కూతురును ఇచ్చింది" అని చెప్పుకొచ్చారు.