Begin typing your search above and press return to search.

'మా' లో విభేదాలు నిజమే : నరేష్‌

By:  Tupaki Desk   |   3 Sep 2018 2:57 PM GMT
మా లో విభేదాలు నిజమే : నరేష్‌
X
మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ కు సంబంధించిన నిధులను అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు దుర్వినియోగం చేశారంటూ ఒక దినపత్రికలో వచ్చిన కథనం సంచలనం రేపిన విషయం తెల్సిందే. ఆ పత్రిక కథనంపై అధ్యక్షుడు శివాజీ రాజా మరియు ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌ లు నేడు ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ క్లారిటీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ మీడియా సమావేశంకు మా కార్యదర్శి నరేష్‌ రాకపోవడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ అనుమానాలు నిజం చేస్తూ ఆ ప్రెస్‌ మీట్‌ కు పోటీగా అన్నట్లుగా నరేష్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టడం జరిగింది. ప్రెస్‌ మీట్‌ లో నరేష్‌ పలు కీలక విషయాలు మాట్లాడారు. పలు సంచలన ఆరోపణలు చేయడంతో పాటు, మా అధ్యక్షుడిపై విమర్శలు చేయడం జరిగింది.

నరేష్‌ మాట్లాడుతూ.. మా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఒక పుణ్య కార్యక్రమంగా తీసుకుని పెద్దలందరిని సంప్రదించి మంచి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాం. మా వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన చిరంజీవి గారితో పాటు ఇంకా పలువురు పెద్దలందరితో కలిసి మంచి కార్యక్రమాలు చేసి మా కు ఒక ఆఫీస్‌ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. స్విలర్‌ జూబ్లీ కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమం అనుకున్నప్పుడు చిరంజీవి గారితో అమెరికాలో చేయించాలని అనుకున్నాం.

చిరంజీవి గారిని సంప్రదించినప్పుడు ఆయన సహృదయంతో స్పందించి తప్పకుండా వస్తాను - సిల్వర్‌ జూబ్లి ఫస్ట్‌ కార్యక్రమంను నేనే చేస్తాను అంటూ చెప్పడం జరిగింది. మొదటి కార్యక్రమంలో భాగంనే నేను ఒక జనరల్‌ సెక్రటరీగా ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. మా కు తాను ఒక సీఈఓ పదవిలో ఉన్నాను కనుక అన్ని నిర్ణయాలు కూడా తనకు తెలిసి జరగాల్సి ఉంది. కాని శివాజీ రాజా మాత్రం తనకు పెద్దగా ప్రాముఖ్యత - ప్రాధాన్యత ఇవ్వకుండానే తనంతట తానుగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ఆయన సీనియర్‌ నటుడు మరియు గతంలో మాకు జనరల్‌ సెక్రటరీగా పని చేసిన అనుభవం ఉంది కనుక మంచి నిర్ణయాలు తీసుకుంటాడనే ఉద్దేశ్యంతో తాను పర్వాలేదు అనుకున్నాను.

మొదటి కార్యక్రమం నిర్వహణకు ముందు ముగ్గురు నలుగురి నుండి కొటేషన్‌ తీసుకుందాం - దాంటో బెటర్‌ దాన్ని ఎంచుకుని ముందుకు వెళ్దాం అంటూ నేను శివాజీ రాజాకు సూచించడం జరిగింది. ఆ విషయంలో తర్వాత నాతో చర్చించడం జరగలేదు. శివాజీ రాజా మరియు శ్రీకాంత్‌ కు మిత్రుడు అయినటువంటి విజయ్‌ ఒక ప్రపోసల్ ను తీసుకు వచ్చాడు. చిరంజీవి గారు వస్తే రెండు కోట్లు ఇస్తాను అంటూ చెప్పారు.

ముందుగా 25 లక్షల అడ్వాన్స్‌ ను కూడా ఇవ్వడం జరిగింది. అందరు ఆమోదంతో ఆ కార్యక్రమం కార్యరూపం దాల్చింది. అయితే కొన్ని రోజులకు ఆ కార్యక్రమంకు కోటి రూపాయలే అని చెప్పడం జరిగింది. ఒక్క కార్యక్రమం కనుక కోటి రూపాయలే అని చెప్పారు. సరే మొదటి కార్యక్రమం వివాదాలు ఎందుకు - పెద్దలు చిరంజీవి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు కనుక వివాదం సృష్టించడం ఎందుకులే అనుకుని ఒప్పేసుకోవడం జరిగింది.

ఆ తర్వాత కూడా మహేష్‌ బాబు కార్యక్రమం గురించి మాట్లాడటం జరిగింది. మహేష్‌ బాబు కార్యక్రమంకు కూడా కోటి రూపాయలే అన్నప్పుడు అనుమానం కలిగింది. కాని ఏమాత్రం మాట్లాడినా కూడా సిల్వర్‌ జూబ్లీ కార్యక్రమానికి అడ్డు వచ్చినట్లుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో మాట్లాడకుండా ఉండిపోయాను. సిల్వర్‌ జూబ్లీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన ఏ విషయం అయినా నాకు తెలియకుండానే జరిగిపోయింది. గత కొంత కాలంగా శివాజీ రాజాతో ఫోన్‌ లో మాట్లాడేందుకు ప్రయత్నించాను. కాని ఆయన మాత్రం రెస్పాండ్‌ కాలేదు. నా ఫోన్‌ కు కాని - మెసేజ్‌ లకు కాని రెస్పాండ్‌ అవ్వలేదు. ఒకానొక సమయంలో నా నెంబర్‌ ను బ్లాక్‌ కూడా చేశాడు.

ఒక ప్రముఖమైన సంస్థకు అధ్యక్షుడిగా ఉండి - ఫారిన్‌ ఫోగ్రాం జరిగే సమయంలో ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్‌. వాళ్లకు కావాల్సిన వారితో కార్యక్రమాన్ని చేయించుకుంటున్న సమయంలో నేను స్పందించాల్సింది. కాని మా ను దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడలేదు. మా కుటుంబం నుండి మా కు నెలకు 15 వేల రూపాయల చొప్పున అందుతుంది. మా అమ్మ తన ప్రతి బర్త్‌ డేకు 70 వేలు - 75 వేలు డొనేట్‌ చేస్తూ ఉంటారు. ఇంత చేస్తున్న తనకు మా గురించి పట్టింపు ఉండదా - అయినా కూడా నేను కార్యక్రమంను చెడగొట్టడం ఇష్టం లేక సైలెంట్‌ గా ఉన్నాను.

అమెరికా కార్యక్రమం కోసం వెళ్లిన వారు ఫ్లైట్‌ లో బిజినెస్‌ క్లాస్‌ లో వెళ్లడం జరిగింది. ఒక్కో టికెట్‌ కు మూడు లక్షల రూపాయలు అవుతాయి. ఆ టికెట్లను ఎవరు పెట్టుకున్నారు. మా నిధుల నుండి ఎందుకు అంత వృదా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక మా ఆధ్వర్యంలో క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ ఈవెంట్‌ కు ఎంత వచ్చిందో కూడా మాకు తెలియదు. మీడియాలో వార్తలు వస్తున్నప్పుడు జర్నలిస్టులు నా వద్దకు వచ్చి కార్యక్రమం వెనుక ఏదో జరుగుతుందని చెప్పిన సమయంలో నాకు తెలియదు అని చెప్పాను. నన్ను కలవనివ్వకుండా - వారు నేను దొరకడం లేదు అంటూ చెప్పడం ఆశ్చర్యంగా అనిపించింది.

మీడియాలో వార్తలు వచ్చిన సమయంలో శివాజీ రాజాతో మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. కాని ఆయన మాత్రం స్పందించలేదు. రెండవ కార్యక్రమం మహేష్‌ తో నిర్వహించే సమయంలో కూడా నేను ఇన్వాల్వ్‌ అవ్వాలని అనుకోలేదు. ఈ కార్యక్రమాల ముసుగులో ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఒక ఫ్యాక్ట్‌ ఫైడ్డింగ్‌ కమిటీని వేయాలని నేను అంటున్నాను. ఇదో పెద్ద సంస్థ కనుక అందరిని దృష్టిలో పెట్టుకుని ఒక రిటైర్డ్‌ ఆఫీసర్‌ తో కమిటీ వేయాలని నేను అంటున్నాను.

అవినీతి జరిగిందని నేను అనడం లేదు - అనుమానాలు వచ్చాయి కనుక నిజాలు తెలియజేయడం మన బాధ్యత. అందుకే దీన్ని ప్రభుత్వంకు అప్పగించి వారి ఆధ్వర్యంలో నిజాలు రాబట్టాలనేది తన అభిప్రాయం అంటూ నరేష్‌ చెప్పుకొచ్చారు.

మొత్తానికి శివాజీ రాజాపై నరేష్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నట్లుగా ఈ మీడియా సమావేశం ద్వారా తేలిపోయింది. ఈ సమయంలో మా పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు - ముందు ముందు ఎక్కడకు దారి తీస్తుందనేది ఆసక్తికరంగా ఉంది.