Begin typing your search above and press return to search.

సీఎం జగన్ తో భేటీ తర్వాతే 'ఆచార్య' విడుదల తేదీ ప్రకటన..!

By:  Tupaki Desk   |   18 Aug 2021 12:30 AM GMT
సీఎం జగన్ తో భేటీ తర్వాతే ఆచార్య విడుదల తేదీ ప్రకటన..!
X
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న యాక్షన్ డ్రామా ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ చిత్రీకరణ మొత్తం పూర్తి చేశారు. అయితే ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.

నిజానికి 'ఆచార్య' చిత్రాన్ని వేసవిలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో వాయిదా వేశారు. దీంతో ఇప్పుడు తదుపరి మంచి సీజన్ కోసం మెగాస్టార్ చూస్తున్నారు. కాకపోతే రాబోయే ఫెస్టివల్ సీజన్స్ డేట్స్ అన్నీ ఇప్పటికే బ్లాక్ అయిపోయాయి. దసరా - దీపావళి - క్రిస్మస్ - సంక్రాంతి.. ఇలా రాబోయే అన్ని పండుగ బెర్తులన్నీ సినిమాలతో నిండిపోయాయి.

దసరాకి 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' - దీపావళికి 'గని' మరియు 'అన్నాత్తే' - క్రిస్మస్‌ కి 'పుష్ప-1' & 'కేజీయఫ్ 2' సినిమాలు విడుదల కానున్నాయి. అలానే సంక్రాంతి పండుగకు 'సర్కారు వారి పాట' - 'రాధే శ్యామ్' - 'భీమ్లా నాయక్‌' - 'ఎఫ్ 3' వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి 'ఆచార్య' చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌ లో లాక్‌ డౌన్‌ ఆంక్షలు - టికెట్‌ ధరల సమస్య కొలిక్కి వస్తే 'ఆచార్య' రిలీజ్ డేట్ ని ప్రకటించాలని భావిస్తున్నారట. ఆగ‌స్ట్ నెలాఖ‌రున ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహన్ రెడ్డితో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. ఇందులో తీసుకునే నిర్ణయాలను బట్టి చిరు త‌న 'ఆచార్య' రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌బోతున్నారని టాక్ వినిపిస్తోంది.

దసరా కానుకగా రావాలని చూస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా అనుకున్న సమయానికి రాకపోవచ్చని అంటున్నారు. మహారాష్ట్ర - కేరళ వంటి రాష్ట్రాల్లో డిసెంబర్ వరకు థియేటర్స్ ఓపెన్ చేసే పరిస్థితి లేకపోవడంతో.. పాన్ ఇండియా చిత్రాలేవీ రిలీజ్ కు రెడీగా ఉండకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే ట్రిపుల్ ఆర్ స్లాట్ లో 'ఆచార్య' ను తీసుకొచ్చే అవకాశం ఉంది.

అప్పుడు కుదరకపోతే 2022 జనవరిలోనే చిరు - చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న 'ఆచార్య' చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. సంక్రాంతి సీజన్ లో ఆల్రెడీ నాలుగు పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి.. వారం ముందు కానీ లేదా వారం తర్వాత గానీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.

కాగా, సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ చిత్రంగా 'ఆచార్య' తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో చిరంజీవి - రామ్ చరణ్ నక్సల్స్ గెటప్ లో కనిపించి అలరించారు. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్.. చరణ్ కు జీడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. సంగీత బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

'ఆచార్య' మెగాస్టార్ కెరీర్ లో వస్తున్న 153వ చిత్రం. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. నిరంజన్ రెడ్డి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొదటిసారి చిరంజీవి - చరణ్ కలిసి నటిస్తున్న పూర్తి స్థాయి సినిమా కావడంతో.. మెగా ఫ్యాన్స్ 'ఆచార్య' పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. చిరు బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ని విడుదల చేస్తారని సమాచారం.