Begin typing your search above and press return to search.

రియల్ స్టోరీతో హీరో కెరీర్ మలుపు తిరుగుతుందా?

By:  Tupaki Desk   |   18 Feb 2016 5:30 PM GMT
రియల్ స్టోరీతో హీరో కెరీర్ మలుపు తిరుగుతుందా?
X
తమిళ రీమేక్ సినిమాలతో తెలుగులో బ్లాక్ బస్టర్లు కొట్టిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి. తెలుగులో తమిళ రీమేక్ ల ఒరవడికి శ్రీకారం చుట్టిందే ఆయన. ఆయన వారసత్వంతో హీరోగా అడుగుపెట్టాడు ఆది పినిశెట్టి. ముందు అతను అరంగేట్రం చేసింది తెలుగులోనే. తేజ దర్శకత్వంలో ‘ఒక విచిత్రం’ అనే సినిమా చేశాడు. కానీ అది ఫ్లాప్ కావడంతో కుర్రాడికి ఇక్కడ బండి నడవలేదు.దీంతో ఎయిడ్స్ నేపథ్యంలో ‘మృగం’ అనే సెన్సేషనల్ సినిమా ద్వారా తమిళంలోకి అడుగుపెట్టాడు. అది తమిళ ప్రేక్షకులకు బాగా నచ్చింది. తర్వాత అక్కడే హీరోగా స్థిరపడిపోయాడు.

‘నీరం’ అనే సినిమా అక్కడ అతడికి మంచి బ్రేక్ ఇచ్చింది. దాన్నే తెలుగులో ‘వైశాలి’ పేరుతో రీమేక్ చేశారు. అందులో ఆదిని చూసి మన ప్రేక్షకులు షాకయ్యారు. ‘ఒకవిచిత్రం’లో చూసి ఆది.. ఈ ఆది ఒక్కడేనా అనిపించేంతగా మారిపోయాడు. పెర్ఫామెన్స్ కూడా అదరగొట్టాడు. తర్వాత ‘గుండెల్లో గోదారి’ లాంటి డైరెక్ట్ తెలుగు మూవీ చేశాడు కానీ.. అది సరైన ఫలితాన్నివ్వలేదు.

ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఓ తమిళ డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాడు ఆది. అదే.. మలుపు. ఆది తమ్ముడు సత్యప్రభాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయవుతుండటం విశేషం. రవిరాజానే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. తమిళంలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ.. తెలుగులో చక్కటి ప్రమోషన్లతో జనాల్లో ఆసక్తి రేపుతోంది. దీని ప్రోమోస్, ట్రైలర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. వారం నుంచి ప్రమోషన్స్ ఉద్ధృతంగా చేస్తున్నారు. ఇది నలుగురు మిత్రుల నిజ జీవిత కథతో తెరకెక్కిన సినిమా కావడం విశేషం. మలుపు ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరి తెలుగులో ఆది కోరుకున్న బ్రేక్ ఈ సినిమా అయినా అందిస్తుందో లేదో చూడాలి.