Begin typing your search above and press return to search.

‘సంజు’లో చేయాలని రాసి పెట్టి ఉందన్నాడు

By:  Tupaki Desk   |   8 Jun 2018 1:30 AM GMT
‘సంజు’లో చేయాలని రాసి పెట్టి ఉందన్నాడు
X
ఈ ఏడాది అత్యంత ఆసక్తి హిందీలో అత్యంత ఆసక్తి రేపుతున్న సినిమాల్లో సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిన ‘సంజు’ ఒకటి. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ హిరాని రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రలో సీనియర్ నటుడు పరేష్ రావల్ నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర తాను చేయడం దైవ నిర్ణయమని అంటున్నాడు పరేష్ రావల్. తానీ పాత్ర చేయాలని పైనుంచి సునీల్ దత్ కోరుకున్నాడేమో అని ఆయన వ్యాఖ్యానించారు.

సునీల్ దత్ 20005 మే 25న చనిపోయారని.. ఆ రోజు విషయం తెలిసి తాను ఇంటికి ఫోన్ చేసి.. రాత్రి రావడం ఆలస్యమవుతుందని.. ఆయన పార్థివ దేహాన్ని చూసి వస్తానని చెప్పానన్నారు పరేష్. ఐతే ఫోన్ చేసినపుడు తన భార్య.. తనకు సునీల్ దత్ నుంచి అదే రోజు లేఖ వచ్చినట్లు చెప్పిందని పరేష్ తెలిపాడు. ఇంతకీ ఆ లేఖ ఏంటి అని అడిగితే.. మే 30న తన పుట్టిన రోజు రాబోతున్న నేపథ్యంలో ఆయన ముందుస్తు శుభాకాంక్షలు పంపారని చెప్పడంతో తాను షాకయ్యానన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సునీల్.. తన గురించి అంతలా ఆలోచించి ముందే తనకు లేఖ రాయడం చాలా ఆశ్చర్యం కలిగించిందన్నాడు పరేష్.

ఇక గత ఏడాది ‘సంజు’లో నటించడం గురించి మాట్లాడేందుకు హిరాని ఇంటికి వెళ్లగా.. అంతకుముందు కనిపించకుండా పోయిన సునీల్ దత్ లేఖ సరిగ్గా అదే రోజు కనిపించినట్లు తనకు తన భార్య ఫోన్ చేసి చెప్పిందని.. ఇది కూడా చాలా యాదృచ్ఛికంగా జరిగిందని.. ఈ పరిణామాలన్నీ చూస్తే తాను సునీల్ దత్ పాత్ర చేయాలని రాసి పెట్టి ఉందేమో.. పై నుంచి సునీల్ దత్ అదే కోరుకున్నారేమో అనిపించిందని పరేష్ రావల్ తెలిపాడు.