Begin typing your search above and press return to search.

టాలీవుడ్: సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలు ఇవే..!

By:  Tupaki Desk   |   1 Jan 2022 5:30 PM GMT
టాలీవుడ్: సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలు ఇవే..!
X
దేశంలో పెరుగుతున్న కరోనా మరియు ఒమిక్రాన్ కేసుల కారణంగా సంక్రాంతి విడుదలలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫెస్టివల్ సీజన్ కోసం 'ఆర్.ఆర్.ఆర్' 'రాధే శ్యామ్' వంటి పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేయగా.. ఇప్పుడు అందులో ఒక్క సినిమా మాత్రమే మిగిలింది. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో థియేటర్లపై ఆంక్షలు విధించారు. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించాల్సి రావడంతో మల్టీలాంగ్వేజ్ రిలీజ్ లకు సమస్యగా మారింది.

ఈ నేపథ్యంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని వాయిదా వేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ ను జనవరి 7న భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఇతర భాషల్లో ఇబ్బందులు ఉండటంతో వెనక్కి తగ్గారు. దీంతో ఈ సమయాన్ని క్యాష్ చేసుకోడానికి ఇతర చిత్రాలు రిలీజ్ డేట్స్ ని ప్రకటిస్తున్నారు.

ప్రస్తుతాని 2022 టాలీవుడ్ సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు నిలవనున్నాయి. ప్రభాస్ - పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''రాధే శ్యామ్''. యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాయి. పాన్ ఇండియా స్థాయిలో జనవరి 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కోవిడ్ నేపథ్యంలో పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినప్పటికీ.. చెప్పిన తేదీకే వస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. మహారాష్ట్ర - తమిళనాడు - కేరళ - ఢిల్లీ రాష్ట్రాల్లో ఆంక్షలు ఉన్నా.. 'రాధే శ్యామ్' వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదని స్పష్టం అయింది.

తండ్రీకొడుకులు అక్కినేని నాగేశ్వర - నాగచైతన్య కలిసి నటిస్తున్న తాజా చిత్రం ''బంగార్రాజు''. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతిని టార్గెట్ పెట్టుకొని శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఇన్నాళ్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండానే ప్రమోషన్స్ జోరు పెంచారు. అయితే ఇప్పుడు RRR వాయిదా పడటంతో టీజర్ తో పాటుగా సంక్రాంతి విడుదల అని ప్రకటించారు నాగ్. ఇది పండగ లాంటి సినిమా అని పేర్కొన్నారు. రేపో ఎల్లుండో డేట్ ని కూడా వెల్లడించనున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ''డీజే టిల్లు'' సినిమాని కూడా సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. RRR కోసం 'భీమ్లా నాయక్' సినిమాని ఫిబ్రవరికి వాయిదా వేసిన సితార టీమ్.. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ పోస్ట్ పోన్ అవడంతో డీజే టిల్లు ని పండగ సీజన్ లో తీసుకొస్తోంది. జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో సిద్ధు జొన్నలగడ్డ - నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు.

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ''హీరో''. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కృష్ణ సమర్పణలో అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ మూవీ రూపొందింది. ముందుగా ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయాలని భావించారు. అయితే ఇప్పుడు సంక్రాంతి బెర్త్ దొరకడంతో జనవరి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. 'సర్కారు వారి పాట' వెనక్కి తగ్గినందుకు ఇప్పుడు సూపర్ స్టార్ అల్లుడికి ఫెస్టివల్ సీజన్ లో దొరకడం గమనార్హం.

ఇలా సంక్రాంతి బరిలో ఒక పాన్ ఇండియా మూవీ - మూడు ప్రాంతీయ చిత్రాలు విడుదలను ఖరారు చేశాయి. వీటితోపాటు అవకాశం దొరికితే కొన్ని డబ్బింగ్ సినిమాలు రావాలని చూస్తున్నాయి. తెలుగు మార్కెట్ మీద ఆశతో అజిత్ కుమార్ 'వలిమై' - సుదీప్ 'K-3' వంటి అనువాద చిత్రాలను పండక్కి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో వీటి మీద క్లారిటీ రానుంది.