Begin typing your search above and press return to search.

దిల్ రాజు అల్లుడి కారును కొట్టేసిన అంబానీ కొడుకు పీఏ?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లుడికి చెందిన విలాసవంతమైన పోర్షే కారును కొట్టేసిన వైనం సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   14 Oct 2023 4:35 AM GMT
దిల్ రాజు అల్లుడి కారును కొట్టేసిన అంబానీ కొడుకు పీఏ?
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లుడికి చెందిన విలాసవంతమైన పోర్షే కారును కొట్టేసిన వైనం సంచలనంగా మారింది. దాదాపు రూ.1.7 కోట్ల విలువైన ఈ కారును దొంగలించటం ఒక ఎత్తు అయితే.. తమకు ఫిర్యాదు అందిన గంటలోపే జూబ్లీహిల్స్ పోలీసులు పట్టేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దొంగలించినోడి బిల్డప్ మరో రేంజ్ లో ఉందని చెప్పాలి.

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని దసపల్లా హోటల్ కు వెళ్లారు. కారును హోటల్ వద్ద నిలిపి లోపలకు వెళ్లిన ఆయన.. నలభై నిమిషాల తర్వాత తిరిగి కారు నిలిపిన చోటుకు వెళ్లగా.. కారు కనిపించకపోవటంతో షాక్ తిన్నారు. ఆ వెంటనే.. జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు.

అర్చిత్ రెడ్డి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. వెంటనే సిబ్బందిని రంగంలోకి దింపి సీసీ కెమేరాల్ని పరిశీలించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద కారు సిగ్నల్ జంప్ చేసినట్లుగా గుర్తించారు. వెంటనే అక్కడి పోలీసుల్ని అలెర్టు చేయగా.. కారును నిలువరించి.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. విలువైన కారును కొట్టేయటం ఒక ఎత్తు అయితే.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు నిందితుడు ఇచ్చిన బిల్డప్ పోలీసులకు కాసేపు నోట మాట రాకుండా చేసింది.

తాను ముకేశ్ అంబానీ కొడుకు అకాశ్ అంబానీ పర్సనల్ అసిస్టెంట్ అని.. మంత్రి కేటీఆర్ కారు తీసుకెళ్లారని చెప్పారని.. దీంతో తన అసిస్టెంట్ హ్రతిక్ రోషన్ తో కలిసి కారును అకాశ్ అంబానీ వద్దకు తీసుకెళుతున్నట్లు చెప్పారు. అతడి మాటలకు విస్తుపోయిన పోలీసులు.. నిందితుడి గురించి ఆరా తీయగా.. అతగాడు మన్సూరాబాద్ కు చెందిన సాయి కిరణ్ గా గుర్తించారు. గడిచిన కొద్ది కాలంగా మతిస్థిమితం లేదని.. బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ లో చికిత్స పొందుతున్నట్లుగా గుర్తించారు. ఈ మొత్తం ఉదంతం గురించి సాయికిరణ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అతడ్ని అదుపులోకి తీసుకొన్నారు. దాదాపు గంట పాటు సాగిన ఈ హైడ్రామా.. జూబ్లీహిల్స్ పోలీసులకు చుక్కలు చూపించిందని చెబుతున్నారు.