జూన్ 1 నుంచి థియేటర్ల బంద్?
తాజాగా అందిన సమాచారం మేరకు... 18 మే 2025న జరిగిన ఆంధ్రప్రదేశ్- తెలంగాణ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్టు తెలిసింది.
By: Tupaki Desk | 19 May 2025 4:01 AMకొద్దిరోజులుగా ఎగ్జిబిషన్ రంగం గురించి ఫిలింఛాంబర్ వర్గాలు సహా సినీపెద్దలు తీవ్రంగా చర్చలు జరుపుతున్నారని ప్రచారం ఉంది. ఇకపై ఏపీ, తెలంగాణలో చాలా థియేటర్లను అద్దె విధానంలో కాకుండా పర్సంటేజ్ బేసిస్ లో నడిపించాలని మెజారిటీ వర్గాలు పట్టుబడుతున్నట్టు కథనాలొస్తున్నాయి. అయితే ఇది కొందరు అగ్ర నిర్మాతలు, పంపిణీదారులకు నచ్చడం లేదని కూడా గుసగుసలు వినిపించాయి.
తాజాగా అందిన సమాచారం మేరకు... 18 మే 2025న జరిగిన ఆంధ్రప్రదేశ్- తెలంగాణ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్టు తెలిసింది. పంపిణీదారులు అద్దె ప్రాతిపదికను పక్కన పెట్టి పర్సంటేజీ విధానంలో థియేటర్లు నడపాలని పట్టుబడుతున్నారట. కానీ ఇది కొందరు నిర్మాతలు, పంపిణీదారులకు నచ్చలేదని, రెండు వర్గాలు ఏర్పడ్డాయని టాక్ వినిపిస్తోంది. కొందరు కీలకమైన నిర్మాతలు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదని చర్చ సాగుతోంది.
అయితే ఈ సమావేశంలో జూన్- 1 నుంచి థియేటర్లను బంద్ చేయాలని పిలుపునిచ్చారని కథనాలొస్తున్నాయి. త్వరలోనే బంద్ నోటీసులు ఛాంబర్, నిర్మాతల మండలికి అందనుందట. ఒకవేళ ఇదే జరిగితే రిలీజ్ కి రెడీ అవుతున్న రెండు పెద్ద సినిమాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. వీటిలో పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, కమల్ హాసన్ `థగ్ లైఫ్` ప్రభావితం అయ్యే ఛాన్సుంది. అయితే ఇంకా బంద్ నిర్ణయం ఫైనల్ కాలేదు. ఈలోగానే చర్చలతో సమస్యకు పరిష్కారం తెస్తారని భావిస్తున్నారు.
పర్సంటేజీ ప్రాతిపదికతో నిర్మాతలకు లాభాలు తగ్గిపోతాయని ఆందోళన చెందుతున్నారట. కానీ పంపిణీదారులు మాత్రం పర్సంటేజీ విధానం అమలు చేయాలని పట్టుబడుతున్నారని తెలిసింది. ఈ రెండు వాదనల్లో ఏది నెగ్గుతుందో కాలమే సమాధానం చెప్పాలి.