పవన్.. నిజంగానే 'సినిమా' చూపిస్తున్నారా?
కొత్త సినిమాలు విడుదల సమయంలో ప్రభుత్వం నుంచి టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతులు తీసుకుంటున్నారు.
By: Tupaki Desk | 25 May 2025 11:17 AMసినిమా వాళ్లకే సినిమా చూపిస్తున్నారా? వారిపై ప్రత్యేక నిఘా కత్తి వేలాడుతుందా? పన్నులు.. ఇతర ఆదాయాలపై ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుందా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ''మీకు కృతజ్ఞత లేదు'' అంటూ.. తెలుగు ఇండస్ట్రీపై ఆగ్రహం వ్యక్తం చేసిన మర్నాడే(ఆదివారం) అన్ని ప్రభుత్వ విభాగాలు అలెర్ట్ అయ్యాయి. రాష్ట్రంలోని అన్ని సినిమా హాళ్లను తనిఖీ చేయడానికి రెడీ అయ్యాయి.
ఇప్పటి వరకు సినిమా హాళ్ల వ్యవహారం.. కేవలం టికెట్ల విక్రయం.. ధరల పెంపు, తగ్గింపు వరకే పరిమితం అయింది. కానీ.. పవన్ ఆదేశాల తర్వాత.. అనూహ్యమైన రీతిలో సినిమా హాళ్ళపై అన్ని కోణాల్లోనూ తనిఖీలు జరుగుతాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రధానంగా 5 కీలక అంశాలపై అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకునేందుకు ఉత్సాహంగా అడుగులు వేయనున్నట్టు డిప్యూటీ సీఎం కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.
ఇవీ.. ఆ ఐదు!
1) తెగుతున్న టికెట్లకు.. ప్రభుత్వానికి కడుతున్న పన్నులకు మధ్య వ్యత్యాసం ఉందా? ఉంటే.. భారీగా జరిమానాలు విధించడం. అవసరమైతే.. హాళ్లను కొన్ని రోజుల పాటు సీజ్ చేయడం.
2) కొత్త సినిమాలు విడుదల సమయంలో ప్రభుత్వం నుంచి టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతులు తీసుకుంటున్నారు. అదేవిధంగా పెంచుతున్నారు. కానీ... పెంచిన ధరల మేరకు.. సర్కారుకు పన్నులు కడుతున్నారా? కట్టకపోతే.. సీరియస్ యాక్షన్ తీసుకోవాలి.
3) మల్టీప్లెక్సుల్లో టికెట్ల ధరలకు.. ప్రేక్షకులకు అందిస్తున్న సౌకర్యాలకు మధ్య పొంతన ఉందా..? లేక.. ప్రేక్షకులు ఇబ్బందులు పడుతున్నారా? దీనిని ప్రేక్షకుల నుంచే అభిప్రాయాల రూపంలో సేకరిస్తారు.
4) సినిమా హాళ్లలో విక్రయించే చిరుతిళ్ల ధరలపై ప్రత్యేక నిఘా.. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకంటే.. కూడా 5 శాతం వరకు ఎక్కువగా పర్మిట్ చేస్తారు. అంతకు మించి.. అమ్మితే కొరడా ఝళిపించనున్నారు.(అయితే.. దీనిపై సుప్రీంకోర్టు రక్షణ ఉంది.)
5) బాత్ రూంలు, కారిడార్లు పరిశుభ్రంగా ఉన్నాయా? లోపల సీట్లు ఎన్ని ఉన్నాయో.. అంతమంది ప్రేక్షకులకు వెయిటింగ్ హాల్ ఉందా? లేదా? నిరంతరం పరిశుభ్రతను పాటిస్తున్నారా? లేదా? అనేది చూస్తారు. ఏ చిన్న తేడా వచ్చినా.. హాళ్లపై భారీ జరిమానాలు విధిస్తారు.
ప్రధానంగా సినిమా నిర్మాతలు, దర్శకులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినా.. అదేసమయంలో ప్రేక్షకులు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కీలక అంశాలపైనా పవన్ దృష్టి పెట్టారు. ఇది మేలైన నిర్ణయమేనని.. ప్రజల నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారు. ప్రస్తుతం సినిమా హాళ్ల పరిస్థితి ఎలా ఉందంటే.. నిర్బంధించి.. సొమ్ములు గుంజడమే.
ఉదాహరణకు బయట పాప్ కార్న్ రూ.50 ఉంటే.. సినిమా హాళ్లలో రూ.250 వరకు ఉంది. బయట సమోసా రూ. 30 ఉంటే.. సినిమా హాళ్లలో 50 వసూలు చేస్తున్నారు. బయట నుంచి కనీసం మంచి నీటి బాటిల్ను కూడా తీసుకురాకుండా అడ్డుకుంటున్నారు. పోనీ హాల్లో కొందామంటే.. రూ.20 బాటిల్ను రూ.40కి విక్రయిస్తున్నారు. ఇక మరుగు దొడ్ల పరిస్థితి మరింత అధ్వానం. ఏసీని ప్రారంభంలో ఉంచి.. మధ్యలోనే తీసేయడం.. ఇలా సినిమా కష్టాలు అనేకం ఉన్నాయి.
తాజాగా పవన్ ఆయా అంశాలన్నింటిపైనా విచారణకు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, తూనికలు, కొలతల శాఖలను రంగంలోకి దింపుతున్నారు. సినిమా హాళ్లను కూలంకషంగా పరిశీలించడంతోపాటు.. వాటి తీరు తెన్నులు తెలుసుకుంటారు. తినుబండారాల విషయం నుంచి శుభ్రత వరకు కూడా కొరడా ఝళిపించనున్నారు. తద్వారా.. పవన్ లక్ష్యం నెరవేరడం ఎలా ఉన్నా.. సగటు ప్రేక్షకులకు మాత్రం చాలా వరకు స్వాంతన చేకూరుతుందన్న చర్చ అయితే.. జరుగుతోంది. తాజా పవన్ ఆగ్రహానికి ఇండస్ట్రీ ఆవేదన చెందుతుంటే.. సగలు ప్రేక్షకులు మాత్రం హ్యాపీగా ఉన్నారు.