Begin typing your search above and press return to search.

హీరో (Vs) నిర్మాత‌ గొడ‌వ‌ల‌పై టాలీవుడ్‌లో ఠాంఠాం

త‌న‌యుడు అర్జున్ క‌పూర్ కి ఛాన్సివ్వ‌డం కోసం బోనీక‌పూర్.. సీక్వెల్ మూవీలో అనీల్ క‌పూర్ కి ఛాన్సివ్వ‌లేద‌ని గుస‌గుస వినిపిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

By:  Tupaki Desk   |   31 March 2024 4:57 AM GMT
హీరో (Vs) నిర్మాత‌ గొడ‌వ‌ల‌పై టాలీవుడ్‌లో ఠాంఠాం
X

ఇండ‌స్ట్రీలో ప్ర‌ముఖ హీరో.. అగ్ర‌ నిర్మాత అయిన అత‌డి సోద‌రుడి మ‌ధ్య అల‌క‌లు పంతాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. స‌ద‌రు నిర్మాత రూపొందిస్తున్న బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ సీక్వెల్లో ఛాన్సివ్వ‌లేద‌ని హీరోగారు అలిగార‌ట‌. దీంతో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌ల‌వుతున్నాయ‌ని ముంబై మీడియా ఠాంఠాం వేస్తోంది. నిజానికి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఫ్రాంఛైజీలో త‌మ్ముడి స్థానంలో కొడుక్కి ఛాన్సిచ్చాడ‌ని ఆ నిర్మాత గురించి చెప్పుకోవ‌డం మొద‌లైంది. ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో ప్ర‌ముఖ హీరో ఎవ‌రు? అగ్ర నిర్మాత ఎవ‌రు? అంటే.. అది క‌పూర్ బ్ర‌ద‌ర్స్ అనీల్ క‌పూర్- బోనీక‌పూర్ గురించే. త‌న‌యుడు అర్జున్ క‌పూర్ కి ఛాన్సివ్వ‌డం కోసం బోనీక‌పూర్.. సీక్వెల్ మూవీలో అనీల్ క‌పూర్ కి ఛాన్సివ్వ‌లేద‌ని గుస‌గుస వినిపిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

దాదాపు దశాబ్ద కాలంగా హల్ చల్ చేస్తున్న 'నో ఎంట్రీ' సీక్వెల్ కపూర్ సోదరుల మధ్య విబేధాలకు కారణమైందని భావిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మించిన ఒరిజినల్ లో సల్మాన్ ఖాన్, ఫర్దీన్ ఖాన్‌లతో పాటు అనిల్ కపూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. నోఎంట్రీ సీక్వెల్ లో అర్జున్ కపూర్, దిల్జిత్ దోసాంజ్, వరుణ్ ధావన్ స‌హా పూర్తిగా కొత్త తారాగణం న‌టిస్తారని భావిస్తున్నారు. తన పేరు స్టార్ కాస్ట్‌లో చేర్చక‌పోవ‌డంతో అనిల్ క‌పూర్ హ‌ర్ట్ అయ్యాడ‌ని నిర్మాత బోనీ స్వ‌యంగా చెప్పారు.

జాతీయ మీడియాతో ఇటీవల జరిగిన ఇంటరాక్షన్‌లో బోనీ కపూర్ కాస్టింగ్ ఎంపిక‌ల స‌మ‌యంలో అనిల్ కపూర్ ని ఎంపిక చేయ‌లేద‌నే విష‌యం ఎలా తెలియ‌జెప్పాలో అర్థం కాలేద‌ని అన్నాడు. కానీ ఈ వార్త మీడియాలో లీక్ అయింది. దీంతో అన్నయ్యపై అనీల్ క‌పూర్ కి కోపం వచ్చింది. ''నో ఎంట్రీ సీక్వెల్ గురించి.. ఇందులో తారాగ‌ణం గురించి నేను నా సోదరుడు అనిల్‌కి చెప్పకముందే, వార్తలు ఇప్పటికే లీక్ కావడంతో అతడు (అనీల్) చాలా కోపంగా ఉన్నాడు. అది లీక్ కావడం దురదృష్టకరమ''ని బోనీ అన్నారు. అతడు నో ఎంట్రీ సీక్వెల్‌లో భాగం కావాలని అనుకుంటున్నాడ‌ని నాకు తెలుసు.. కానీ ఖాళీ లేదు. నేను ఎందుకు ఇలా చేశానో వివరించాలనుకుంటున్నాను అని బోనీక‌పూర్ అన్నారు. అయితే త్వరలోనే అంతా సర్దుకుంటుందని ఆశిస్తున్నాన‌ని అన్నాడు. ''ఈ ప్రక్రియలో నా సోదరుడు ఇప్పటికీ సరిగ్గా మాట్లాడటం లేదు. త్వరలో అన్నీ సర్దుకుంటాయని ఆశిస్తున్నాను.. చూద్దాం'' అన్నారాయన.

అయితే ప్ర‌తిష్ఠాత్మ‌క సీక్వెల్ కోసం కొత్త తారాగణాన్ని ఎంపిక చేయ‌డానికి కారణాన్ని బోనీ వివరించాడు. వరుణ్ - అర్జున్ క‌పూర్ గొప్ప స్నేహితులు. అందువ‌ల్ల ఈ కథలో వారి కెమిస్ట్రీ బయటకు రావచ్చు. దిల్జిత్ ఇటీవ‌ల గొప్ప‌గా రాణిస్తున్నాడు. అత‌డికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నేటి కాలానికి ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు న‌టీన‌టుల‌ను ఎంపిక చేయాల‌నుకున్నాను. అందుకే ఈ కాస్టింగ్‌ చేశాను.. అని బోనీ అన్నారు.

2005 రొమాంటిక్ కామెడీ నో ఎంట్రీ చెప్పుకోద‌గ్గ‌ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌లో ఒక‌టి. లారా దత్తా, ఈషా డియోల్, సెలీనా జైట్లీ, బిపాషా బసు ఇందులో క‌థానాయిక‌లు. తాజా సీక్వెల్‌లో కథానాయికలుగా ఎవరు కనిపిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. గుస‌గుస‌ల ప్ర‌కారం... కాస్టింగ్ లాక్ అయిన తర్వాత, ఈ చిత్రం ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళుతుంద‌ని తెలుస్తోంది.

తాజాగా అన్న‌ద‌మ్ములైన బోనీ- అనీల్ క‌పూర్ మ‌ధ్య వివాదంపై ఇటు టాలీవుడ్ మీడియాలోను ఠాంఠాం మోగుతోంది. ఇటీవ‌ల బోనీక‌పూర్ తెలుగు సినిమాల నిర్మాణంలోను భాగం అవుతున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పింక్ రీమేక్ వ‌కీల్ సాబ్ ని దిల్ రాజుతో క‌లిసి స‌హ‌ నిర్మించిన సంగ‌తి తెలిసిందే.