వామ్మో... అమ్మోరు తల్లి కోసం రూ.100 కోట్లు!
నయనతార ప్రధాన పాత్రలో ఆర్జే బాలాజీ, ఎన్.జె.శరవణన్ దర్శకత్వంలో రూపొంది 2020లో వచ్చిన చిత్రం 'మూకుత్తి అమ్మన్’
By: Tupaki Desk | 8 Feb 2025 11:30 AMనయనతార ప్రధాన పాత్రలో ఆర్జే బాలాజీ, ఎన్.జె.శరవణన్ దర్శకత్వంలో రూపొంది 2020లో వచ్చిన చిత్రం 'మూకుత్తి అమ్మన్’. తెలుగులో ఈ సినిమాను అమ్మోరు తల్లి గా డబ్ చేశారు. థియేటర్ రిలీజ్ కోసం ఈ సినిమాను రూపొందించారు. రెండు మూడు సార్లు ఈ సినిమా విడుదల వాయిదా వేశారు. కరోనా కారణంగా సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయడం సాధ్యం కాదని భావించిన మేకర్స్ సిడ్నీ ప్లస్ హాట్ స్టార్లో డైరెక్ట్ రిలీజ్ చేశారు. ఓటీటీ స్ట్రీమింగ్లో సినిమాకు మంచి స్పందన దక్కింది. ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా మంచి లాభాలు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు వచ్చి ఉండేవి అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.
ఆమధ్య మూకుత్తి అమ్మన్ సినిమాను థియేటర్ల ద్వారా తీసుకు వచ్చే ప్రయత్నాలు జరిగాయి. కానీ అప్పటికే ఓటీటీలో ఎక్కువ శాతం మంది చూశారు, శాటిలైట్ ద్వారా చాలా మంది చూడటం వల్ల థియేటర్కి జనాలు రాకపోవచ్చు అనే ఉద్దేశ్యంతో నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. అమ్మోరు తల్లి సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నయనతార ఇమేజ్ మరింత పెరిగింది. లేడీ సూపర్ స్టార్గా నయనతార తాజాగా మూకుత్తి అమ్మన్ సీక్వెల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల కథ సైతం రెడీ అయ్యిందని తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదల చేసేందుకు గాను నిర్మాతలు రెడీ అవుతున్నారు.
మూకుత్తి అమ్మన్ సినిమా దర్శకత్వ బాధ్యతలను సుందర్ సి కి అప్పగించినట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్కి దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీ ఈసారి దర్శకత్వం బాధ్యతల నుంచి తప్పుకున్నారని సమాచారం. కోలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం నటీ నటులు, టెక్నికల్ టీం పారితోషికంతో కలిపి మూకుత్తి అమ్మన్ 2 సినిమాకు గాను నిర్మాతలు రూ.100 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. నయనతార కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా నిలవడంతో పాటు, కోలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్తో రూపొందబోతున్న లేడీ ఓరియంటెడ్ మూవీగా నిలువనుంది. ఈ సినిమాలో ఒక స్టార్ను గెస్ట్ రోల్లో నటింపజేసే అవకాశాలు ఉన్నాయి.
మూకుత్తి అమ్మన్ సినిమా భక్తితో పాటు వినోదాన్ని కలిగి ఉంటుంది. అమ్మవారితో ఆర్జే బాలాజీ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. అదే సమయంలో సినిమాలో మంచి మెసేజ్ను సైతం చూపించారు. అదే తరహాలో మూకుత్తి అమ్మన్ 2 సినిమాలోనూ భక్తిని చూపించడంతో పాటు వినోదాన్ని ప్రధానంగా సాగించనున్నారు. అదే సమయంలో సనాతన ధర్మం గురించి మంచి మెసేజ్ను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమాను మొదటి పార్ట్ తరహాలోనే మంచి కమర్షియల్ హిట్ చేయడం కోసం దర్శకుడు సుందర్ సి స్క్రిప్ట్ రెడీ చేశారట. అరణ్మనై 4 విజయంతో జోష్ మీద ఉన్న సుందర్ సి ఈ సినిమాను చాలా నమ్మకంతో రూపొందించబోతున్నారు. ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్ కోసం మెజార్టీ బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.