Begin typing your search above and press return to search.

ఆ నలుగురిలో నేను లేను.. నాకేం సంబంధం లేదు: అల్లు అరవింద్

టాలీవుడ్ లో కొద్ది రోజులుగా ఎలాంటి పరిణామాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 May 2025 1:53 PM
ఆ నలుగురిలో నేను లేను.. నాకేం సంబంధం లేదు: అల్లు అరవింద్
X

టాలీవుడ్ లో కొద్ది రోజులుగా ఎలాంటి పరిణామాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని కొద్ది రోజుల క్రితం ఎగ్జిబిటర్స్ ప్రకటించారు. పర్సంటేజ్ విధానంలో సినిమాలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ అలా చేస్తే తమకు నష్టం వస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇంతలో ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది.

ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా కనీస కృతజ్ఞత లేదని పవన్ మండిపడ్డారు. అదే సమయంలో ఆయన మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ కు ముందు థియేటర్స్ మూసివేత నిర్ణయం ఎందుకు వచ్చిందని, విచారణ చేయాలని అధికారులను ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ఆదేశించారు. అదే సమయంలో ఓ నలుగురు నిర్మాతలు పవన్ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.

ఆ నలుగురిలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. దీంతో ఆయన ఆదివారం సాయంత్రం స్పందించారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్‌ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా థియేటర్లు మూసివేస్తామని అనడం దుస్సాహసమేనని అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోరాడుతున్న వ్యక్తి పవన్ అని అన్నారు. డిప్యూటీ సీఎం గారు, సీఎం చంద్రబాబు గారు మనకు తెలిసిన వారే కదా కలుద్దాం అన్నారని పేర్కొన్నారు. గతంలో పవన్ కల్యాణ్‌ ను తాము కలిసినప్పుడు సీఎం చంద్రబాబును కలవాలని తమకు ఆయన చెప్పారని వెల్లడించారు. కానీ కొందరు కలవకుండా నిర్లక్ష్యం చేశారని తెలిపారు.

అలా లేట్ అయిందని, ఇప్పటి వరకు ఛాంబర్ వాళ్లు ఎవరూ వెళ్లలేదని అల్లు అరవింద్ చెప్పారు. వెళ్లి కలవడం మన బాధ్యత అని అన్నారు. అయితే డిప్యూటీ సీఎం పేషీ నుంచి వచ్చిన లెటర్ సమర్థనీయమని, సమస్యలు ఎక్కడైనా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఏ వ్యాపారం అయినా సవ్యంగా జరగాలంటే ప్రభుత్వ సహకారం ముఖ్యమని గుర్తు చేశారు.

ఏదైనా చిన్న చిన్న విషయాలకే థియేటర్లు మూసేస్తామని అనడం కరెక్ట్ కాదని అల్లు అరవింద్ అన్నారు. అయితే సినిమాలు నిర్మించడమే 50 ఏళ్లుగా తన వృత్తిగా తెలిపారు. జూన్‌ 1వ తేదీన నుంచి థియేటర్లు మూసేస్తామనే ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ స్పందన కూడా సమంజసమైందని అభిప్రాయపడ్డారు.

అయితే టాలీవుడ్ లో ఇటీవల నెలకొన్న పరిణామాలపై జరిగిన ఏ సమావేశానికి కూడా తాను వెళ్లలేదని తెలిపారు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్‌ డిస్ట్రిబ్యూటర్లు, అసోసియేటెడ్‌ ప్రొడ్యూసర్స్‌ ను కూడా వెళ్లొద్దని చెప్పానని పేర్కొన్నారు. సింగిల్‌ స్క్రీన్స్‌ కష్టాల్లో ఉన్నాయని, అయితే యజమానులు ఫిల్మ్‌ ఛాంబర్‌, ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ ను సంప్రదించాలని సూచించారు.

ముఖ్యంగా ఆ నలుగురు.. ఆ నలుగురు అంటూ రెండు రోజుల నుంచి వార్తలు వచ్చాయని అన్నారు. వారు హస్తాల్లోనే ఇండస్ట్రీ మొత్తం ఉన్నట్లు క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. ఆ నలుగురితో తనకేం నాకు సంబంధం లేదని, ఆ నలుగురిలో తాను లేనని చెప్పారు. ఎప్పుడో సంబంధాలు తెంచుకున్నానని స్పష్టం చేశారు అల్లు అరవింద్.

అయితే ఆ నలుగురు అనే మాట ఇప్పటిది కాదని.. 15 ఏళ్ల క్రితం ప్రారంభమైందని ఆయన చెప్పారు. తర్వాత ఆ నలుగురు కాస్త పది మంది అయ్యారని, అది మాత్రం ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఆ నలుగురిలో తాను లేనని చెప్పారు. కొవిడ్ సమయంలోనే బయటకు వచ్చేశానని తెలిపారు. అందుకే తన పేరు వాడొద్దని కోరారు.

తెలంగాణలో తనకు ఒకే థియేటర్ ఉందని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాటిలో తనవి 15 లోపేనని స్పష్టం చేశారు. లీజు పూర్తయ్యాక వాటిని రెన్యువల్‌ చేయొద్దని స్టాఫ్‌ కు ఎప్పుడూ చెబుతుంటానని, అవి కూడా త్వరలో ఉండవని అన్నారు. కావాలనే కొందరు తన దగ్గర ఎక్కువ థియేటర్లు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. తాను సినిమానే నమ్ముకున్నానని తెలిపారు. ప్రస్తుతం అల్లు అరవింద్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.