Begin typing your search above and press return to search.

అదుర్స్-2 అసలు జరగని పని.. ఎందుకంటే

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. అదుర్స్ సినిమా అప్పట్లో ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   4 April 2024 1:30 AM GMT
అదుర్స్-2 అసలు జరగని పని.. ఎందుకంటే
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. అదుర్స్ సినిమా అప్పట్లో ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దాదాపు 14 ఏళ్ల క్రితం రిలీజైన ఈ మూవీలో తారక్ డ్యూయల్ రోల్ పోషించారు. ఎన్టీఆర్ చేసిన చారి రోల్ అయితే ఐకానిక్‍ గా నిలిచిపోయింది. చారి పాత్రలో తారక్ పండించిన కామెడీ, మేనరిజమ్స్ ఇప్పటికీ అందరికీ గుర్తుంటాయి. ఎన్టీఆర్- బ్రహ్మానందం కామెడీ ఆ సినిమాకు హైలైట్‍ గా నిలిచింది.

వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రం హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ఆ మూవీ రచయిత కోన వెంకట్ చేసిన వ్యాఖ్యలే. ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిన ఈ మూవీ సీక్వెల్ కోసం ఆయన ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తానని తాజాగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు అదుర్స్-2 టాపిక్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇక అదుర్స్-2 విషయంలో కోన వెంకట్ చేసిన కామెంట్స్ పై డైరెక్టర్ వినాయక్ స్పందిస్తారేమోనని అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే వినాయక్ గతంలో ఓ ఇంటర్వ్యూలో అదుర్స్ సీక్వెల్ పై స్పష్టతనిచ్చారు. అదుర్స్-2 ఎప్పుడు చేస్తారు, పాజిబుల్ అవుతుందా అవ్వదా అని యాంకర్ అడగ్గా.. పాజిబుల్ అవ్వదని క్లారిటీ ఇచ్చారు. ఒకట్రెండు ఐడియాస్ అనుకున్నాం గానీ, అవి అక్కడితో ఆగిపోతున్నాయని తెలిపారు. తనకే నచ్చడం లేదని వెల్లడించారు.

"అదుర్స్ అనేది నా కెరీర్ లో ఓ బెస్ట్ మూవీ. తారక్ కెరీర్ లో కూడా మంచి సినిమా. దాన్ని అలానే ఉంచితేనే బెటర్. ఇప్పటికీ టీవీ, ఫోన్స్ లో ఆ సినిమాను చూస్తూనే ఉంటారు. దాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. సినిమా విషయంలో ఎవరూ బాధపడకూడదని అప్పుడు కొన్ని చర్యలు తీసుకున్నాను. అభ్యంతరం తెలిపిన వాళ్లకు క్లారిటీ ఇచ్చి మరీ సినిమా రిలీజ్ చేశాను. ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ ఎప్పుడైనా చేయగలరు" అని వినాయక్ తెలిపారు.

మంచి స్క్రిప్ట్ దొరికితే ఎన్టీఆర్ తో మళ్లీ ఇంకో సినిమా చేస్తానని చెప్పారు. ఇప్పుడు నెట్టింట.. ఓ వైపు కోన వెంకట్ మాట్లాడిన వీడియో, మరోవైపు వినాయక్ మాట్లాడిన ఓల్డ్ ఇంటర్వ్యూ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అదుర్స్ -2 విషయంపై వినాయక్ గానీ, ఎన్టీఆర్ గానీ స్పందిస్తారేమో చూడాలి.

ఇంతకీ వెంకట్ ఏమన్నారంటే?

కోన వెంకట్ నిర్మించిన గీతాంజలి-2 ట్రైలర్ ఈవెంట్ లో వెంకీకి సీక్వెల్ చేయాలనుకుంటున్నారా అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. "వెంకీ 2 సంగతి నాకు తెలియదు కానీ.. అదుర్స్ 2 చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యా. అవసరమైతే తారక్ ఇంటి ముందు టెంట్ వేసి.. నిరాహార దీక్ష చేసైనా సరే ఆయనతో అదుర్స్ 2 చేయిస్తా. చారి పాత్రను ఎన్టీఆర్ తప్ప దేశంలో మరెవరు కూడా చేయలేరు. అదుర్స్ 2 చిత్రాన్ని దర్శకుడు వినాయక్‍ తోనే ప్లాన్ చేస్తాం" అని తెలిపారు. ఇక వినాయక్ ఇప్పటికే కుదరదని చెప్పేశారు. మరేం జరుగుతుందో చూడాలి.