Begin typing your search above and press return to search.

400 చిత్రాల సూప‌ర్ హీరో 100కోట్ల క్ల‌బ్‌లో జీరో

సౌత్ ఇండియన్ సినీ ప‌రిశ్ర‌మ‌లో దిగ్గజ క‌థానాయ‌కుల‌కు కొద‌వేమీ ఏదు. ప‌దుల సంఖ్య‌లో సౌత్ నాలుగు ప‌రిశ్ర‌మ‌ల్లోను సూపర్ స్టార్లు ఉన్నారు

By:  Tupaki Desk   |   16 Oct 2023 4:33 AM GMT
400 చిత్రాల సూప‌ర్ హీరో 100కోట్ల క్ల‌బ్‌లో జీరో
X

అత‌డు 400 చిత్రాల క‌థానాయ‌కుడు. ఐదు ద‌శాబ్ధాల కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించాడు. సౌతిండియాలో బిగ్గెస్ట్ స్టార్. కానీ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ 100 కోట్ల మార్క్‌ను అందుకోలేదు. కానీ అత‌డు సూప‌ర్ స్టార్ అనే పిలుపందుకున్నాడు. ఇండ‌స్ట్రీలో పెద్ద‌రికం హోదాను కొన‌సాగిస్తున్నాడు. ఇంత‌కీ ఎవ‌రా అగ్ర హీరో? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.


సౌత్ ఇండియన్ సినీ ప‌రిశ్ర‌మ‌లో దిగ్గజ క‌థానాయ‌కుల‌కు కొద‌వేమీ ఏదు. ప‌దుల సంఖ్య‌లో సౌత్ నాలుగు ప‌రిశ్ర‌మ‌ల్లోను సూపర్ స్టార్లు ఉన్నారు. కేవలం సినిమా స్టార్ల‌గానే కాకుండా, రాజకీయ రంగంలోను గణనీయమైన ప్రభావం చూపే స్టార్లు సౌత్ లో ఉన్నారు. తమిళ పరిశ్రమలో రజనీకాంత్.. ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్, ఇల‌య‌ద‌ళ‌పతి విజయ్ వంటి దిగ్గజాలు ఇటీవ‌ల రాజ‌కీయాల్లో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌ల్లోకి రాగా.. టాలీవుడ్ లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్, నంద‌మూరి బాల‌కృష్ణ స‌హా ప‌లువురు స్టార్లు సినీరాజ‌కీయ రంగాల్లో ప్ర‌ముఖ వ్య‌క్తులుగా ఉన్నారు. చిరు త‌న రాజ‌కీయాల్ని విడిచిపెట్టినా కానీ త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఎప్పుడూ అండ‌గా ఉంటార‌న్న‌ది తెలిసిందే.

అటు మలయాళ చిత్ర పరిశ్రమలో ప‌లువురు సినీరాజ‌కీయ రంగాల్లో త‌మ‌దైన ముద్ర వేస్తున్న వారు ఉన్నారు. అయితే 400 చిత్రాలకు పైగా అందించిన పాపుల‌ర్ అగ్ర‌క‌థానాయ‌కుడు మమ్ముట్టి ప్ర‌భావం కేవ‌లం సినీరంగం వ‌ర‌కే కాకుండా మీడియ రంగంలోను చెప్పుకోద‌గిన విధంగా ఉంది. విశేషమేమిటంటే మ‌మ్ముట్టికి ద‌శాబ్ధాల కాలంలో సుదీర్ఘ‌మైన విజ‌య‌వంత‌మైన‌ ఫిల్మోగ్రఫీ ఉన్నప్పటికీ, ఆయ‌న‌ సినిమాలు ఎప్పుడూ బాక్సాఫీస్ కలెక్షన్లలో 100 కోట్ల రూపాయల మార్కును దాటలేదు.

మమ్ముట్టి సౌతిండియాలో బిగ్గెస్ట్ స్టార్ గా హోదాను అందుకున్నారు. మలయాళం, తమిళం, తెలుగు ప‌రిశ్ర‌మ‌ల్లో నాణ్య‌మైన న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు. ఐదు దశాబ్దాల కెరీర్‌లో పొరుగున ఉన్న త‌మిళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లోను చెరగని ముద్ర వేసారు. కెరీర్ లో మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఏడు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. మలయాళ సినిమాకు ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1998లో ప్రతిష్టాత్మక పద్మశ్రీతో సత్కరించింది. దానికి తోడు ఆయ‌న‌ గౌరవనీయమైన కేరళ ప్ర‌భ‌ అవార్డును అందుకున్నాడు.

సినిమా రంగంలో ప్ర‌వేశించ‌క ముందు మమ్ముట్టి వృత్తిరీత్యా న్యాయవాది. అతడు సినీ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ముందు రెండు సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసారు. అతడి సినీ ప్రయాణం 1971లో KS సెంతుమాధవన్ దర్శకత్వం వహించిన 'అనుభవాల్ పాలిచకల్' అనే చిత్రంతో ప్రారంభమైంది. 'అహింస' చిత్రంతో న‌టుడిగా గొప్ప పేరొచ్చింది. మ‌మ్ముట్టి సుదీర్ఘ కెరీర్ లో మూడు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు ఉన్నాయి. మామాంగమ్ - మధుర రాజా రెండూ 2019లో విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వ‌ద్ద‌ మమ్ముట్టి పేరు మార్మోగేలా చేసిన చిత్రాలివి.

వెండితెర కెరీర్‌కు అతీతంగా మమ్ముట్టి మలయాళ కమ్యూనికేషన్స్ ఛైర్మన్‌గా.. కైరాలి టీవీ, కైరాలి న్యూస్ , కైరాలి వీ వంటి మలయాళ టెలివిజన్ ఛానెల్‌లను పర్యవేక్షిస్తున్నారు. అతడు డిస్ట్రిబ్యూషన్-ప్రొడక్షన్ హౌస్ ప్లేహౌస్ .. మమ్ముట్టి కంపానీకి కూడా అధ్యక్షుడిగా కొన‌సాగిస్తున్నాడు. 1980లో అతడు సల్ఫత్ ని పెళ్లాడారు. ఈ దంప‌తులు ఇద్ద‌రు పిల్లలకు గ‌ర్వించ‌ద‌గిన‌ తల్లిదండ్రులు. ముఖ్యంగా వారి కుమారుడు దుల్కర్ సల్మాన్ మలయాళ పరిశ్రమలో తనకంటూ ఒక గొప్ప‌ పేరు తెచ్చుకున్నాడు. ఒకే బంగారం, సీతారామం వంటి చిత్రాల‌లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు.

కథల్, బజూకా, బ్రహ్మయుగం మమ్ముట్టికి ఇటీవ‌ల మంచి పేరు తెచ్చిన చిత్రాలు. తాజా విడుదల 'కన్నూర్ స్క్వాడ్' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూనే ఉంది. వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొంది రూపొందిన ఈ చిత్రం గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్. మలయాళ సినీప‌రిశ్ర‌మ‌లో ఎదురులేని వాడిగా మ‌మ్ముట్టి కొన‌సాగుతున్నారు. ఆయ‌న వార‌సుడిగా దుల్కార్ పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నాడు. సీతారామంతో న‌టవార‌సుడు దుల్కార్ ఎర్లీ స్టేజ్ లోనే 100 కోట్ల క్ల‌బ్ సాధించాడు. కానీ మ‌మ్ముట్టి సుదీర్ఘ ఇన్నింగ్స్ లో ఇంకా 100 కోట్ల క్లబ్ ని అందుకోక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.