Begin typing your search above and press return to search.

మణిపూర్ ఘటన పూర్తి పాఠం... వెలుగులోకి మరింత ఘోరం!

పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌. లో నమోదు చేసిన వివరాల ప్రకారం

By:  Tupaki Desk   |   21 July 2023 3:45 AM GMT
మణిపూర్ ఘటన పూర్తి పాఠం... వెలుగులోకి మరింత ఘోరం!
X

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించిన వీడియో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశంలో ఏ ఇద్దరి వ్యక్తులు కలిసినా వారి మధ్య ఈ చర్చే అన్నా అతిశయోక్తి కాదేమో. అయితే... అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, మొదలైన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి!

జాతుల మధ్య ఘర్షణలతో గత రెండున్నర నెలలుగా వణికిపోతోన్న మణిపూర్ సంగతి తెలిసిందే. అక్కడ జరుగుతున్న జాతుల మధ్య ఘర్షణవల్ల వేల మంది ప్రాణాలు కోల్పోయారని.. లక్షల మంది గాయాల పాలయ్యి ఉండొచ్చని కొన్ని నివేధికలు వెల్లడవుతున్నాయి! తాజాగా వెలుగుచూసిన దారుణ ఘటనతో మళ్లీ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసిందనే మాటలు వినిపిస్తున్నాయి.

పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌. లో నమోదు చేసిన వివరాల ప్రకారం.. మణిపుర్‌ లో మే 3న రెండు తెగల మధ్య తొలుత హింస చెలరేగింది. రెండు వర్గాల దాడులతో మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌ కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌ పోప్కి జిల్లాలో మొదట ఇది వేడెక్కింది.

తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై కొందరు యువకులు మరో వర్గానికి చెందిన గ్రామాలపై దాడులు చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తమ ఊరి మీదికి కూడా ఆ వర్గం దాడి చేయడానికి రాబోతోందని భావించారట బీ.ఫయనోమ్‌ గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు. దీంతో మే 4వ తేదీన వీరంతా సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఇందులో ఓ 50 ఏళ్ల వ్యక్తి, అతడి కుమారుడు (19), కుమార్తె (21)తోపాటు మరో ఇద్దరు ఇతర మహిళలు ఉన్నారు. అదే సమయంలో వారికి సమీపంలో పోలీసులు కనిపించడంతో వారి వద్దకు వెళ్లారు. అంతలోనే దాదాపు 800 నుంచి 1000 మందితో ఉన్న ఓ భారీ గుంపు.. బీ.ఫయనోమ్‌ గ్రామంలోకి ప్రవేశించి ఈ ఐదుగురి బృందాన్ని అడ్డగించింది.

అనంతరం పోలీసుల వద్ద నిలబడి ఉన్న వారిపై దాడికి పాల్పడింది. అందులోని 19 ఏళ్ల యువకుడు తన సోదరి (21)ని రక్షించేందుకు ప్రయత్నించాడు. కానీ.. సాయుధ మూకల దాడిలో అతడితోపాటు యువతి తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

అనంతరం.. 21 ఏళ్ల యువతితోపాటు మరో మహిళను నగ్నంగా ఊరేగిస్తూ సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. కొందరు యువకులు అమ్మాయిల శరీర భాగాలను చేతులతో తడుముతూ అసభ్యంగా ప్రవర్తించారు. అందులో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మే 18నే జీరో ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదయ్యింది.

అయితే ఈ ఘటన మే 4న చోటుచేసుకున్నప్పటికీ మణిపుర్‌ లో మే 3నుంచి ఇంటర్నెట్‌ వినియోగంపై నిషేధం ఉండటంతో ఈ వ్యవహారం బయటకు రాలేదన్ని తెలుస్తుంది. తాజాగా ఆ వీడియో ఇంటర్నెట్‌ లో ప్రత్యక్షం కావడం, వెంటనే వైరల్‌ గా మారడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, పార్లమెంటు ఉభయ సభలు.. సుప్రీం కోర్టు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ అంశంపై తీవ్ర స్థాయిలో స్పందించాయి. అయితే ఉభయసభల్లోనూ విపక్షాలు ఈ విషయంపై చర్చకు పట్టుబట్టడంతో ఈరోజుకి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

అయితే ఈ వీడియోలో గ్రీన్ టీషర్ట్ ధరించి మహిళను అసభ్యంగా తాకుతూ నడిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అవును... ఈ దారుణ ఘటనకు సంబంధించి హెరాదాస్‌ (32) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సమాచారం. వీడియోలో కనిపిస్తోన్న నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఈ సమయంలో నిందితులకు ఉరిశిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ ప్రకటించారు. దీంతో... ఈ వీడియో వైరల్ కావడంతో ప్రపంచానికి తెలిసింది కాబట్టి ఇప్పుడు ఇలాంటి కబుర్లు చెబుతున్నారు.. ఇన్ని రోజులు ఈ విషయాన్ని మసిపూరి మారెడు కాయ చేయాలని భావించారా అంటూ సీఎం బీరెన్ సింగ్ పై విపక్షాలు ఫైరవుతున్నాయి.