Begin typing your search above and press return to search.

ప్రేమించిన ప్రియుడి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోమంది.. ఊహించని దారుణం

ఆనవాళ్లు లేకుండా ఉండేందుకు 31 ముక్కలుగా నరికిన దారుణ ఉదంతం బయటకు వచ్చి కలకలాన్ని రేపింది.

By:  Tupaki Desk   |   27 Nov 2023 3:55 AM GMT
ప్రేమించిన ప్రియుడి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోమంది.. ఊహించని దారుణం
X

విన్నంతనే విషాదం కమ్మేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఒడిశాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో ప్రేమించిన ప్రియుడ్ని పెళ్లి చేసుకోవాలని కోరేందుకు వెళ్లిన ఒక యువతిని.. అతగాడు.. అతడి భార్య కలిసి ఆమెను అత్యంత దారుణంగా చంపేయటమే కాదు.. ఆనవాళ్లు లేకుండా ఉండేందుకు 31 ముక్కలుగా నరికిన దారుణ ఉదంతం బయటకు వచ్చి కలకలాన్ని రేపింది. తన మానాన తాను బతుకున్న యువతి జీవితంలోకి వచ్చిన ఒక వివాహితుడి ఆరాచకంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఒడిశాలోని రాయ్ ఘర్ పోలీసు ఉన్నతాధికారి అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే.. బాఘబెడ గ్రామానికి చెందిన 23 ఏళ్ల తిలాబతి గండ్ తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఆమె కోసం చుట్టుపక్కల వెతికిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదును ఇచ్చారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో వారికి షాకింగ్ నిజం వెల్లడైంది. కనిపించకుండా పోయిన తిలాబతి.. చంద్రరౌత్ అనే పెళ్లైన వ్యక్తిని ప్రేమించింది. ఆ మాటకు వస్తే అతడే ఆమె జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. మాయ మాటలు చెప్పాడు. మనసుకు దగ్గరయ్యాడు. తర్వాత ఆమెకు పెళ్లైన విషయం తెలిసినప్పటికీ అతడ్ని వదులుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ ఆమె అతడి ఇంటికి వెళ్లింది.

తనను పెళ్లి చేసుకోకుంటే ఇంట్లోనే ఉండిపోతానని.. కోర్టుకు వెళతానని హెచ్చరించింది. దీనికి అతడి భార్య సియాబతి అంగీకరించలేదు. దీంతో.. ముగ్గురు మధ్య వాగ్వాదం జరిగంది. ఈ నేపథ్యంలో తనను మోసం చేసిన చంద్రరౌత్ సంగతి చూస్తానని చెప్పగా.. ఆమెను భార్యభర్తలు ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం చంపేశారు. అనంతరం ఆమె డెడ్ బాడీని అడవిలోకి తీసుకెళ్లి 31 భాగాలుగా నరికేసి.. అనంతరం పాతి పెట్టి పరారు అయ్యారు. ఈ దారుణాన్ని ప్రత్యక్షంగా చూసిన గ్రామానికి చెందిన జుగుసాయి షాక్ తిని.. ఆ వెంటనే ఊళ్లో ఉన్న వారికి తెలియజేశారు.

దీంతో.. వారంతా కలిసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి శరీర భాగాల్ని వెలికి తీశారు. అదే సమయంలో మిస్సింగ్ కేసును విచారిస్తున్న పోలీసులకు ఈ వివరాలు తెలియటంతో.. ఇద్దరు ఒక్కరేనన్న విషయం అర్థమైంది. వెంటనే.. వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శవపరీక్ష అనంతరం ఆమె డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఘటనాస్థలంలోనే ఆమెను ముక్కలు చేసిన కత్తి లభించింది. నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ప్రస్తుతానికి వారు తప్పించుకు తిరుగుతున్నారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.