Begin typing your search above and press return to search.

ఢిల్లీలో దారుణం.. ఐఫోన్ కోసం టీచర్ ను ఆటోలోంచి ఈడ్చుకెళ్లారు

ఆమె చేతిలోని ఐ ఫోన్ ను దొంగలించేందుకు రెండు బైకులు మీద ముగ్గురు యువకులు వచ్చారు.

By:  Tupaki Desk   |   15 Aug 2023 4:01 AM GMT
ఢిల్లీలో దారుణం.. ఐఫోన్ కోసం టీచర్ ను ఆటోలోంచి ఈడ్చుకెళ్లారు
X

దారుణ ఉదంతానికి మరోసారి వేదికగా మారింది దేశ రాజధాని ఢిల్లీ. ఐఫోన్ కోసం ముగ్గురు యువకులు చేసిన అమానుషం షాకింగ్ గా మారింది. ఆటోలో వెళుతున్న ఒక మహిళ చేతిలోని ఐఫోన్ కోసం దుర్మార్గంగా వ్యవహరించారు. ఆటోలో నుంచి రోడ్డు మీదకు లాగేయటమే కాదు.. రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన వైనం గురించి తెలిసిన వారు షాక్ తింటున్నారు. ఒక ఫోన్ దొంగలించేందుకు ఇంతకు తెగబడతారా? అన్నది ప్రశ్నగా మారింది.

అసలేమైందంటే.. యొవికా ఛౌదరి అనే మహిళ సౌత్ ఢిల్లీలోని సాకేత్ లో టీచర్ గా పని చేస్తున్నారు. ఆగస్టు పదకొండున ఆమె స్కూల్ అయ్యాక.. ఆటోలో బయలుదేరారు. ఆమె చేతిలోని ఐ ఫోన్ ను దొంగలించేందుకు రెండు బైకులు మీద ముగ్గురు యువకులు వచ్చారు. ఆటోలో ఉన్న ఆమె ఐఫోన్ ను పట్టుకోగా.. దాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో.. ఆమె ఆ ఫోన్ ను గట్టిగా పట్టుకోవటం.. దాన్ని లాగేసే ప్రయత్నంలో టీచర్.. ఆటోలో నుంచి రోడ్డు మీద పడిపోయారు.

అయినప్పటికీ వదలని దుండగులు.. ఆమె చేతిలోని ఫోన్ ను బలంగా పట్టుకొని ఉండగా.. దాన్ని సొంతం చేసుకోవటానికి బలంగా గుంజారు. ఈ క్రమంలో ఆమెను రోడ్డు మీద ఈడ్చుకు వెళ్లేందుకు వెనుకాడలేదు. ఈ పెనుగులాటలో ఓపిక కోల్పోయిన టీచర్.. తన ఫోన్ ను వదిలేశారు. దీంతో.. వారు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు ఉపాధ్యాయురాలిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె కోలుకుంటున్నారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతటి రాక్షసత్వానికి పాల్పడిన యువకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.