Begin typing your search above and press return to search.

స్మార్ట్‌ ఫోన్‌ రేపిన చిచ్చు.. భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త!

ఎక్కువ సమయం ఫోన్‌ తోనే గడుపుతోందని.. ఎవరితోనో తన భార్యకు సంబంధం ఉందని అనుమానించిన ఒక వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు.

By:  Tupaki Desk   |   21 Aug 2023 7:31 AM GMT
స్మార్ట్‌ ఫోన్‌ రేపిన చిచ్చు.. భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త!
X

ప్రస్తుతం చాలా పనులకు స్మార్ట్‌ ఫోన్‌ లేనిదే పని జరగడం లేదు. చిన్నాపెద్ద ఇలా ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్‌ ను వినియోగిస్తున్నారు. ఇదే క్రమంలో స్మార్ట్‌ ఫోన్‌ కొన్ని అనర్థాలకు సైతం కారణమవుతోంది. అదే పనిగా ఫోన్‌ కు బానిసవుతోందని.. ఎక్కువ సమయం ఫోన్‌ తోనే గడుపుతోందని.. ఎవరితోనో తన భార్యకు సంబంధం ఉందని అనుమానించిన ఒక వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన కర్ణాటకలో కలకలం సృష్టించింది.

ఈ దారుణ హత్య వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడ తాలూకాలోని వైఎన్‌ హొసకోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బూదిబెట్ట గ్రామంలో లక్ష్మి, రామాంజినప్ప దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.

ఈ మధ్య అతడి భార్య లక్ష్మి ఎక్కువ సమయం ఫోన్‌ తోనే గడుపుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఎవరితోనో చాలాసేపు ఫోన్‌ లో మాట్లాడింది. ఆ మాటలను తలుపు చాటున ఉండి భర్త రామాంజినప్ప విన్నాడు. ఇంక అంతే.. అనుమానంతో రగిలిపోయాడు. తన భార్యకు ఎవరితోనో వివాహేతర సంబంధం ఉందని భావించాడు. అంతేకాకుండా దీనిపై గ్రామంలో పెద్ద మనుషులతో పంచాయతీ కూడా పెట్టించాడు. వారు రామాంజినప్పకు నచ్చజెప్పారు. అయితే అతడు వినలేదు.

తనని దారుణంగా మోసం చేస్తున్న భార్యను కడ తేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రాత్రి భార్య నిద్రిస్తుండగా రోకలి బండతో తలపై బలంగా బాదాడు. దీంతో రక్తస్రావంతో నిండిపోయిన ఆమెను బయటకు ఈడ్చుకు వచ్చి మళ్లీ బండరాయితో తల పై కొట్టి అత్యంత పాశవికంగా హత్య చేశాడు.

ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. లక్ష్మి మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

భార్యను హత్య చేసిన రామాంజినప్పను పోలీసులు అరెస్టు చేశారు. ఓవైపు తల్లి కన్నుమూయడం, తండ్రి జైలు పాలు కావడంతో పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు. దీంతో స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.