Begin typing your search above and press return to search.

ఆమెను 5 దెయ్యాలు ఆవహించాయి.. పాతబస్తీలో దొంగ బాబా ఆరాచకం

దుర్మార్గమైన ఉదంతం ఒకటి తాజాగా వెలుగు చూసింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఒక దొంగ బాబా చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   31 Aug 2023 3:58 AM GMT
ఆమెను 5 దెయ్యాలు ఆవహించాయి.. పాతబస్తీలో దొంగ బాబా ఆరాచకం
X

దుర్మార్గమైన ఉదంతం ఒకటి తాజాగా వెలుగు చూసింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఒక దొంగ బాబా చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. దెయ్యాలు వదిలిస్తానని చెబుతూ తప్పుడు పనులు చేసే మజహర్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక అమ్మాయికి ఐదు దెయ్యాలు ఆవహించాయని.. వాటిని వదిలిస్తానని చెప్పి.. పూజల పేరుతో లైంగిక దాడి జరిపిన దారుణం వెలుగు చూసింది. పాతబస్తీలోని హుస్సేని ఆలంకు చెందిన 21 ఏళ్ల అమ్మాయికి తలాబ్ కట్ట భవానీనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో మూడు నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది.

అత్తారింటికి వచ్చిన ఆమె ఆరోగ్యం కొంతకాలానికే క్షీణించింది. ఇదంతా ఆమెను దుష్టశక్తులు పట్టి ఉంటాయని అబ్బాయి తల్లి అనుమానపడింది. దీంతో.. ఆమె సూచన మేరకు బర్కత్ పురలోని ఒక బాబా వద్దకు వెళ్లి పూజలు చేయించారు. అయినా.. ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో పాతబస్తీలోని బండ్లగూడ రహ్మత్ నగర్ కు చెందిన 30 ఏళ్ల మజహర్ ఖాన్ అనే తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారు.

ఆమెను పరిశీలించిన అతడు.. ఆమెను ఐదు దెయ్యాలు ఆవహించాయని.. వదిలించేందుకు పూజలు చేయాలని చెప్పాడు. తొలుత బాధితురాలి ఇంటికి వచ్చి అక్కడి పరిస్థితుల్ని చూసిన అతడు.. ఆ తర్వాత తన ఇంటి వద్దకు రావాలని చెప్పాడు. భర్తతో కలిసి వచ్చిన బాధితురాలి నడుము చుట్టూ దారం కట్టాలని చెప్పి.. కళ్లకు గుడ్డ కట్టాలన్నాడు. అలా చేసిన తర్వాత పూజలు చేయాలంటూ భర్తను బయటకు పంపాడు.

ఆ తర్వాత బాధితురాలిని పడుకోబెట్టి.. నూనె రాసి మర్దన చేశాడు. ఆ తర్వాత ఒంటి మీద నూనె రాస్తూ ఆమె బట్టలు తీసేశాడు. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం పాలతో ఒంటిని కడిగిన అతను.. కొత్త బట్టలు కట్టుకోవాలని చెప్పాడు. పూజలో భాగంగా జరిగిన విషయాలు ఇంట్లో చెబితే అనర్థాలు జరుగుతాయని హెచ్చరించి ఇంటికి పంపాడు. అయితే.. ఇంటికి వెళ్లిన తర్వాత పూజ పేరుతో తన మీద జరిగిన అఘాయిత్యాన్ని భర్తకు చెప్పింది బాధితురాలు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి కంప్లైంట్ ఇద్దామంటే భర్త వద్దని ఆమెను అడ్డుకున్నాడు.

ఆమెను ఇంట్లోనే ఉంచేసి బయటకు రానివ్వలేదు. పది రోజుల అనంతరం ఆమెను చూసేందుకు వచ్చిన సోదరికి విషయం మొత్తం చెప్పటంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది. ఆ వెంటనే అప్పటి సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు. దీంతో.. దొంగ బాబా పరారయ్యాడు. అదే సమయంలో సీఐ బదిలీ కావటంతో కేసు అక్కడితో ఆగిపోయింది. ఇంత జరిగినా.. ఈ దొంగ బాబాను ట్రేస్ చేసింది లేదు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. పోలీసుల మీద ఒత్తిడి తెచ్చే క్రమంలో ఈ విషయం బయటకు వచ్చింది. ఇంతదారుణం జరిగిన తర్వాత కూడా పోలీసులు నిందితుడ్ని పట్టుకోవటంలో మీనవేషాలు ఎందుకు లెక్కిస్తున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.