10ఏళ్లయినా దొరకని హంతకుడు.. ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో భారతీయ వ్యక్తి
సీసీటీవీ ఫుటేజీలో ఆ దంపతులు కిచెన్ వైపు వెళ్లడం, ఆ తర్వాత కనిపించకుండా పోవడం రికార్డైంది.
By: Tupaki Desk | 22 May 2025 7:30 AMఅమెరికాలో ఒక దారుణమైన హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఒక భారతీయ వ్యక్తి, దాదాపు పదేళ్లయినా ఇప్పటికీ దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఈ కేసు ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చింది. ఎందుకంటే ఆ వ్యక్తిని ఎఫ్బీఐ తమ 'టెన్ మోస్ట్ వాంటెడ్ ఫ్యూజిటివ్స్' జాబితాలో చేర్చింది. అతని పేరు బద్రేష్కుమార్ చేతన్భాయ్ పటేల్.
ఈ దారుణం 2015 ఏప్రిల్ 12న జరిగింది. అప్పుడు 24 ఏళ్ల వయసున్న బద్రేష్కుమార్ పటేల్, తన 21 ఏళ్ల భార్య పాలక్ పటేల్ను మేరీల్యాండ్లోని హానోవర్లో ఉన్న ఒక డొనట్ షాపులో నైట్ షిఫ్ట్ చేస్తుండగా, ఒక వస్తువుతో చాలాసార్లు కొట్టి దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సీసీటీవీ ఫుటేజీలో ఆ దంపతులు కిచెన్ వైపు వెళ్లడం, ఆ తర్వాత కనిపించకుండా పోవడం రికార్డైంది. ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చినా స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి, లోపలికి వెళ్లి చూడగా పాలక్ మృతదేహం కనిపించింది. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసుల దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు కేవలం ఒక నెల ముందు ఆ దంపతుల వీసాల గడువు ముగిసిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. పాలక్ తిరిగి భారతదేశానికి వెళ్లాలని కోరుకుందని, అయితే బద్రేష్ కుమార్ పటేల్ అందుకు వ్యతిరేకించాడని సమాచారం. "ఆమె వెళ్లడం అతనికి ఇష్టం లేదు" అని ఎఫ్బీఐ స్పెషల్ ఏజెంట్ జొనాథన్ షాఫర్ అన్నారు. "ఆమె భారతదేశానికి తిరిగి వెళ్తే తనకు అవమానం జరుగుతుందని అతను భయపడి ఉండవచ్చు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
హత్య జరిగిన ఎనిమిది రోజుల తర్వాత, బద్రేష్ కుమార్ పటేల్ పై ఫెడరల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అతనిపై ఫస్ట్-డిగ్రీ మర్డర్, సెకండ్-డిగ్రీ మర్డర్, ఫస్ట్-డిగ్రీ అసాల్ట్, సెకండ్-డిగ్రీ అసాల్ట్ వంటి అభియోగాలు మోపారు.
పోలీస్ చీఫ్ అమల్ ఇ. అవాద్ మాట్లాడుతూ.. పాలక్ అమెరికాలో తనను తాను పోషించుకోవడానికి, భారతదేశంలోని తన కుటుంబానికి సహాయం చేయడానికి వారంలో ఏడు రోజులు పని చేసిందని తెలిపారు. ఈ నేరం జరిగినప్పటి నుంచి బద్రేష్ కుమార్ పటేల్ తప్పించుకుని తిరుగుతున్నాడు. అతని చివరిగా గుర్తించిన ప్రదేశం న్యూజెర్సీలోని నెవార్క్ ప్రాంతం. అధికారులు అతను కెనడాకు పారిపోయి ఉండవచ్చని, అక్కడి నుంచి భారతదేశానికి కూడా తిరిగి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. 2017లో అతను అమెరికాలోని తన దూరపు బంధువుల వద్ద దాక్కుని ఉండవచ్చని ఎఫ్బీఐ ఊహించింది.
అదే సంవత్సరం పటేల్ను అధికారికంగా ఎఫ్బీఐ 'టెన్ మోస్ట్ వాంటెడ్ ఫ్యూజిటివ్స్' జాబితాలో చేర్చారు. మొదట్లో అతనిపై 100,000డాలర్ల రివార్డు ప్రకటించగా, ఇప్పుడు అది 250,000డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 2 కోట్లకు పైగా) కు పెంచారు. హత్య జరిగి దాదాపు దశాబ్దం కావస్తున్న సందర్భంగా.. ఫెడరల్ ఏజెంట్లు, స్థానిక పోలీసులు ప్రజల సహాయం కోసం మళ్లీ విజ్ఞప్తి చేశారు.