Begin typing your search above and press return to search.

ఐఫోన్ మేకింగ్ టాటా గ్రూపు చేతికి.. అదెలానంటే?

ఐఫోన్ల తయారీలోకి అడుగు పెట్టాలని డిసైడ్ అయిన టాటా గ్రూప్.. గడిచిన ఏడాదికి పైగా విస్ట్రన్ కార్ప్ తో చర్చలు జరుపుతూనే ఉంది.

By:  Tupaki Desk   |   28 Oct 2023 4:15 AM GMT
ఐఫోన్ మేకింగ్ టాటా గ్రూపు చేతికి.. అదెలానంటే?
X

అరుదైన ఘనతను టాటా గ్రూపు సొంతం చేసుకుంది. భారతదేశ ప్రజలు అత్యంత విశ్వసనీయత ప్రదర్శించే కంపెనీల్లో టాటా ముందుంటుంది. ఏదైనా వస్తువు కొనే విషయంలో కాస్తంత కన్ఫ్యూజన్ కు గురై.. చివరకు దేనికి తమ ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయానికే వస్తే.. ఆ రెండింటిలో ‘టాటా’ ఒకటైతే.. పది మందిలో తొమ్మిది మంది ఛాయిస్ టాటాదే అవుతుంది. భారతీయులకు అంతటి గురి.. ఆ సంస్థ మీద. అలాంటి సంస్థ చేతికి ఐఫోన్ తయారీని దేశీయంగా తయారు చేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

భారత్ లో ఐఫోన్లను తయారీ చేసే అవకాశాన్ని టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. మరో రెండున్నరేళ్లలో టాటాలు తయారు చేసే ఐఫోన్లు దేశ.. విదేశాల్లోనూ అమ్మకాలు జరపనున్నారు. ఈ ఆసక్తికర సమాచారాన్ని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అధికారికంగాప్రకటించారు. ఐఫోన్ల తయారీని భారత్ లో కర్ణాటక ప్లాంట్ లో తయారు చేసేవారు. ఈ సంస్థ పేరు విస్ట్రాన్. ఇది తైవాన్ కు చెందిన కంపెనీ. తాజాగా దీన్ని టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేసిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొంటూ.. ‘‘విస్ట్రాన్ ఆపరేషన్స్ ను కొనుగోలు చేసిన టాటా సంస్థకు అభినందనలు. రానున్న రెండున్నరేళ్లలో దేశీయ.. ప్రపంచ మార్కెట్ కోసం టాటా గ్రూప్ భారత్ లో ఐఫోన్ తయారీని ప్రారంభించనుంది’’ అని పేర్కొన్నారు.

ఐఫోన్ల తయారీలోకి అడుగు పెట్టాలని డిసైడ్ అయిన టాటా గ్రూప్.. గడిచిన ఏడాదికి పైగా విస్ట్రన్ కార్ప్ తో చర్చలు జరుపుతూనే ఉంది. మొదట్లో జాయింట్ వెంచర్ గా డీల్ ఉంటుందన్న ప్రచారం జరిగినా.. చివరకు మాత్రం సంస్థను సొంతం చేసుకోవటంపైనే టాటా మొగ్గు చూపింది. చివరకు తాను అనుకున్నది సాధించింది. తాజాగా జరిగిన విస్ట్రాన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో టాటాకు సంస్థను సొంతం చేసే ఆఫర్ మీద ఓకే చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు.

దీంతో విస్ట్రాన్ ప్లాంట్ లో వంద శాతం వాటా టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ కు అమ్మేందుకు డీల్ ఓకే యేశారు. ఈ ఒప్పందం విలువ 125 మిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫ్లాంట్ లో ఐఫోన్ 14 మోడల్ ను అసెంబ్లింగ్ చేస్తున్నారు. పది వేల మంది ఉద్యోగులు ఈ ప్లాంట్ లో పని చేస్తున్నారు. 2024 మార్చి నాటికి 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్ల తయారీకి నిర్ణయించింది. మొత్తంగా దేశంలో ఐఫోన్లను తయారీ చేసే తొలి భారత కంపెనీ ఘనతను టాటాలు సొంతం చేసుకోవటంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.