Begin typing your search above and press return to search.

రూ. 19 వేల కోట్ల పరిశ్రమలకు పట్టాభిషేకం.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం!

ఇందులో భాగంగా... తాజాగా జరిగిన మంత్రిమండలి సమావేశంలో రూ.19 వేల కోట్ల పెట్టుబడులతో పలు పరిశ్రమల స్థాపనకు ఆమోదం తెలిపారు.

By:  Tupaki Desk   |   3 Nov 2023 11:26 AM GMT
రూ. 19 వేల కోట్ల పరిశ్రమలకు  పట్టాభిషేకం.. జగన్  సర్కార్  కీలక నిర్ణయం!
X

రాష్ట్రంలో పారిశ్రామిక వికాసానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎం వైఎస్ జగన్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పెట్టుబడిదారులకు పలు అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా... వారు కోరిన మేరకు భూములు ఇవ్వడంతోబాటు పలు రాయితీలు.. మౌలిక సౌకర్యాలు కల్పిస్తోంది. అందుకే దేశంలోనే పరిశ్రమల స్థాపనకు, వ్యాపారాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక ముఖ్యమైన ఎంపికగా మారింది.

ఇప్పటికే విశాఖ పెట్టుబడుల సదస్సులో అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు సైతం పాల్గొనడం, రూ. 13 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులకు ప్రతిపాదనలు రావడం తెలిసిందే. ఇదే క్రమంలో... కడప స్టీల్ ప్లాంట్, విశాఖలో టైర్ల పరిశ్రమలు, ఐటీ, ఫార్మా రంగాల్లో భారీగా పరిశ్రమలు, కంపెనీలూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మండలి (ఎస్.ఐ.పీ.బీ.) సమావేశంలో పలు పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా... తాజాగా జరిగిన మంత్రిమండలి సమావేశంలో రూ.19 వేల కోట్ల పెట్టుబడులతో పలు పరిశ్రమల స్థాపనకు ఆమోదం తెలిపారు.

పలు పరిశ్రమలకు మార్గం సుగమం:

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద రిలయన్స్ పవర్ ఆధ్వర్యంలో రూ. 6,174 కోట్ల పెట్టుబడితో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రాబోతోంది. దీని కోసం సంస్థ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపగా.. దాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆమోదించింది. ఫలితంగా... 600 మందికి ప్రత్యక్షంగా మరో 2 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దీంతోబాటు ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి.

ఇదే క్రమంలో... అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం దగ్గరున్న పారిశ్రామికవాడలో స్మైల్ కంపెనీ రూ. 166 కోట్లతో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చింది. దీనివల్ల దాదాపు 5,000 వేలమందికి ఉపాధి దొరుకుతుంది. ఇదే సమయంలో... ఇదే సెజ్ లో ఉన్న ఏటీసీ టైర్స్ సంస్థ రూ. 679 కోట్లతో సంస్థను విస్తరించనుంది. దీంతో... కొత్తగా సుమారు 300 మందికి ఉద్యోగాలు రానున్నాయని తెలుస్తుంది.

ఇంకా ఏలూరులోని కొమ్మూరువద్ద రూ.114 కోట్లతో ఏర్పాటు కానున్న వెంకటేశ్వర బయోటెక్ సంస్థ 310 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. అదేవిధంగా... తిరుపతిలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ సంస్థ రూ.933 కోట్లతో సంస్థను విస్తరిస్తుంది. దీంతో... దీనివల్ల సుమారు 2,100 మందికి ఉద్యోగాలు దొరుకుతాయని సమాచారం. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కడియం వద్ద ఉన్న ఆంధ్రపేపర్ మిల్లు విస్తరణకు ఆ సంస్థ ముందుకు వచ్చింది.

దీంతో... దీనికోసం రూ.4,000 కోట్లు పెట్టుబడి పెడుట్టనుంది. ఫలితంగా.. సుమారు 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. ఇదే క్రమంలో... విజయనగరంలోని శృంగవరపు కోట (ఎస్.కోట) వద్ద సుమారు రూ.531 కోట్లతో ఏర్పాటు చేస్తున్న జే.ఎస్.డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కులో ప్రత్యక్షంగా 35,750 మందికి.. పరోక్షంగా 9,375 మందికి ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా... విశాఖ జిల్లా పద్మనాభం వద్ద రూ.50 కోట్లతో ఓరిల్ ఫుడ్స్ సంస్థ ఏర్పాటు కానుండగా.. దీనిలో 550 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

దీంతో మొత్తం మీద 50 వేల మందికి పైగా ప్రత్యక్షంగా.. 10వేల పైచిలుకు మందికి పరోక్షంగా ఉద్యోగాలు దొరకబోతున్నాయి! దీంతో రాష్ట్ర చరిత్రలో ఇదో కీలక మలుపు అని అంటున్నారు పరిశీలకులు.