Begin typing your search above and press return to search.

ఏపీలో బీసీ పార్టీ...ఎవరికి దెబ్బ...?

ఆ పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ

By:  Tupaki Desk   |   24 July 2023 4:04 AM GMT
ఏపీలో  బీసీ పార్టీ...ఎవరికి దెబ్బ...?
X

ఏపీలో ఎన్నికలు గట్టిగా చూస్తే తొమ్మిది నెలల లోపు కూడా లేవు. ఎన్నికల ముందు కొత్త పార్టీలు అనేకం వస్తూంటాయి. అయితే ఏపీ విభజన తొమ్మిదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ఒక కొత్త పార్టీ పురుడు పోసుకోవడం విశేషం. బీసీల పార్టీగా ఒక నూతన పార్టీ గుంటూరు నడిబొడ్డున ఏర్పాటు అయింది.

ఆ పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ. రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీయార్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఈ పార్టీ ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు. అంతే కాదు బీసీ ఉద్యమ కారుడు సూరజ్ మండల్ అటెండ్ అయ్యారు. దీంతో బీసీలు బహుజనుల పార్టీగా ఇది ఏర్పాటు అయింది అని అంతా భావిస్తున్నారు.

ఈ పార్టీని స్థాపించిన వారు రామచంద్ర యాదవ్. ఈయన ప్రముఖ వ్యాపారవేత్త. చిత్తూరు జిల్లాకు చెందిన వారు. అంటే టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన వారు, ముఖ్యమంత్రి జగన్ హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమ నుంచి వచ్చిన వారు. ఇదొక రాజకీయ విశేషం అయితే ఏపీలో బీసీల కోసం పార్టీగా ఇది వస్తోంది.

ఏపీలో బీసీలు నూటికి డెబ్బై శాతం ఉన్నారని ఒక అంచనా. పైగా యాదవులు కూడా బీసీలలో అతి పెద్ద సామాజికవర్గంగా ఉన్నారు. ఏపీలో యాదవులు చాలా నియోజకవర్గాలలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఇక మిగిలిన బీసీలు కూడా ఏపీ మొత్తంలో నూటికి ఎనభై శాతం నియోజకవర్గాలలో వారి ప్రభావం కచ్చితంగా ఉంటుంది.

ఇక రామచంద్ర యాదవ్ 2019లోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన జనసేన నుంచి పోటీ చేశారు. ఈసారి ఎన్నికలకు ఆయన స్వయంగా పార్టీని ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పార్టీని ఏర్పాటు చేసినట్లుగా అయన చెబుతున్నా ఆయన పార్టీ పేరు షార్ట్ కట్ లో చూస్తే బీసీవై అని వస్తుంది. అంటే ఆ సంకేతమే బీసీల కోసం ఒక పార్టీ అని చెబుతోంది.

ఇక ఏపీలో అన్ని సామాజిక వర్గాలకు ఒక పార్టీ ఉందని, బీసీలకు మాత్రం లేదు అంటూ వచ్చారు. ఇపుడు ఆ లోటు తీర్చ విధంగా ఈ పార్టీ ఏర్పాటు అయింది. ఏపీలో బీసీలు టీడీపీ ఆవిర్భావం తరువాత నుంచి ఆ పార్టీ వెంటనే ఉంటూ వచ్చారు. ఫస్ట్ టైం 2019లో వారు వైసీపీ వైపు మళ్లారు. ఇపుడు బీసీల కోసం వైసీపీ టీడీపీల మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది.

ఈ రెండు పార్టీలూ బీసీలను ఆకట్టుకోవడం కోసం సోషల్ ఇంజనీరింగ్ ని నమ్ముకున్నాయి. ఇపుడు ఏకంగా బీసీల పార్టీనే ఏర్పాటు అవుతోంది. మొత్తం 175 సీట్లకు పోటీ చేస్తామని అంటోంది. బీసీల ఓటు ఇటు వైపు వస్తుందా అలా చీలిక కనుక వస్తే ఎవరికి లాభం అన్నది కూడా ఇక్కడ చర్చకు వస్తోంది. మరో వైపు చూస్తే అధికార వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని టీడీపీ జనసేన అంటున్నాయి.

ఇపుడు కొత్తగా వచ్చిన బీసీ పార్టీ సొంతంగా పోటీ చేస్తాను అంటోంది. 2024 ఎన్నికలు గట్టిగా సాగుతాయి. అటూ ఇటూ ఓట్ల తేడా కూడా చాలా స్వల్పంగా ఉండవచ్చు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో బీసీవై లాంటి పార్టీలు రంగంలోకి దిగి ఎంతో కొంత బీసీల ఓట్లను చీల్చినా అది విపక్షాలకే చేటు చేస్తుంది అన్న అంచనా ఉంది. మొత్తానికి చూస్తే బీసీవై పార్టీ ఆవిర్భావం వల్ల అధికార పక్షం కంటే విపక్షానికి ఎక్కువ దెబ్బ అని అంటున్నారు. చూడాలి మరి రానున్న కాలంలో ఈ పార్టీలోకి ఎవరు చేరుతారో ఎంతవరకూ పుంజుకుంటుందో దాన్ని బట్టి లెక్కలు మారే అవకాశం ఉంది.