పూటలో 21.1 లక్షల సెట్లు అమ్మేశారు

Update: 2015-06-08 10:03 GMT
బెట్టుగా ఫోన్లు అమ్ముకునే కంపెనీల్లో షియోమీ ఒకటి. చైనా యాపిల్ ఫోన్ గా సుప్రసిద్ధమైన ఈ ఫోన్ ను ఇండియాలో ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే అమ్మేవారు. ఈ ఫోన్ పుణ్యమా అని ఫ్లిప్ కార్ట్ బాగా ఫేమస్ అయిపోయింది.

సాంకేతికంగా బాగున్న ఈ ఫోన్ తక్కువ ధర ఉండటం.. సదరు సాంకేతికత ఉన్న ఫోన్ల విలువ పాతిక వేల రూపాయిలు ఉన్న రోజుల్లో షియోమీ మాత్రం రూ.12వేలకే అందించటంతో ఆ ఫోన్ల కోసం జనాలు విపరీతంగా వెంటపడ్డారు. ఆన్ లైన్ లో ఆ ఫోన్ల కోసం వెల్లువెత్తిన డిమాండ్ తో ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ క్రాష్ అయిన విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇలాంటి రికార్డుల్ని ఎన్నింటినో మూట కట్టుకున్న షియోమీ తాజాగా మరో రికార్డును క్రియేట్ చేసింది.

తన ఐదో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్లాష్ సేల్ లో రికార్డు స్థాయి అమ్మకాల్ని నిర్వహించింది. మొబైల్ ఫోన్లతో పాటు.. టీవీలు.. రూటర్లు లాంటి వస్తువుల్ని కూడా అమ్మకాలు పెట్టింది. కేవలం పన్నెండు గంటల వ్యవధిలో ఆ షియోమీ 21.1లక్షల ఫోన్లను అమ్మేసి గిన్నిస్ రికార్డు కూడా కొట్టేసింది. గతంలో మాదిరి ఒక్క ఈ కామర్స్ సంస్థ ద్వారా కాకుండా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకొని ఈ రికార్డు సాధించింది. మొత్మమ్మీదా గురువారం నాడు షియోమీ అమ్మకాలతో మొబైల్ మార్కెట్ విస్తుపోయేలా చేసిందనటంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News