లంచాలపై పేర్ని నాని వ్యాఖ్యలు వైరల్

Update: 2020-02-09 17:22 GMT
ఉద్యోగులు లంచం తీసుకోవడం అనే అంశంపై ఏపీ మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. విజయవాడలో జరిగిన ఏపీ ఉద్యోగ జెఏసి తృతీయ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలోనే లంచాలపై స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఎవరైనా సంతోషంగా ఇస్తే హాయిగా జేబులో పెట్టుకోవచ్చని ఆయన చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

ఉద్యోగులపై జరుగుతున్న ఏసీబీ దాడుల అంశం గురించి సభలో లేవనెత్తడంతో మంత్రి లంచాల గురించి మాట్లాడారు. ఎవరైనా సంతోషంగా ఇస్తే గిఫ్ట్ రూపంలో తీసుకోవచ్చని చెప్పిన ఆయన - పీక మీద కత్తి పెట్టి లంచం అడగకూడదని అన్నారు. లంచగొండి తనాన్ని పైనుంచి నరుక్కొద్దామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని తెలిపారు. జగన్ నేతృత్వంలో ప్రతీ మంత్రి నీతిగానే బతుకున్నారని ఆయన అన్నారు.

లంచాలు తీసుకొని పరువు పోగొట్టుకోవద్దని పేర్ని నాని అన్నారు. నీతిగా ఉండేవాళ్ళకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. పని చేస్తూ పోతే సంతోషంగా  ఏదైనా ఇస్తే గిఫ్ట్ అవుతుందని - అదే పీకమీద కత్తి పెట్టి అడిగితే అది దారి దోపిడి అవుతుందని ఆయన పేర్కొన్నారు. గిఫ్ట్ ఇస్తే హాయిగా తీసుకోండి.. కానీ దారిదోపిడీ చేయొద్దని తన వద్దకు వచ్చిన ప్రతీ ఉద్యోగికీ చెబుతానని ఆయన తెలిపారు. జనాలను పీడిస్తే ఏసీబీ దాడి తప్పదని చెప్పారు. పబ్లిక్ గా పేర్ని నాని లంచాలపై ఇలా మాట్లాడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 


Tags:    

Similar News