విశాఖలో బ్రదర్... వైసీపీకి ట్రబుల్... ?

Update: 2022-03-14 08:54 GMT
ఆయన రాజకీయ నేత కాదు, మత ప్రచారకుడు మాత్రమే. కానీ ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వారు. వైఎస్సార్ అల్లుడుగా బ్రదర్ అనిల్ కుమార్ ఒకపుడు మీడియాలో ఎంతో కొంత పరిచయం ఉన్న పేరు. ఇక జగన్ కాంగ్రెస్ పార్టీ  నుంచి బయటకు వచ్చాక ఆయనకు నీడగా తోడుగా ఉన్న వారు కూడా బ్రదర్ అనిల్ అని చెప్పాలి.

మరో వైపు చూస్తే వైఎస్సార్సీపీ విజయం కోసం షర్మిల చాలానే కృషి చేసింది. జగన్ బావగా బ్రదర్ అనిల్ కుమార్ తెర వెనక చాలా చేసారు. ఆయన క్రిస్టియన్ సంఘాలు సంస్థలతో తనకు ఉన్న విస్తృతమైన పరిచయాలతో వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్ గా వారిని మార్చారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం బ్రదర్ హడావుడి తగ్గింది.

ఈ నేపధ్యంలో తెలంగాణాలో షర్మిల పార్టీ పెట్టారు. అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఇపుడు బ్రదర్ దూకుడు ఏపీలో రాజకీయంగా కలకలం రేపుతోంది. ఆయన వరసబెట్టి వివిధ సామాజిక వర్గాలు,  సంఘాల నేతలతో మీటింగులు పెడుతున్నారు. అంతే కాదు, బీసీలు ఇతర వర్గాల ప్రతినిధులతో కూడా మంతనాలు చేస్తున్నారు.

రీసెంట్ గా విజయవాడలో  బ్రదర్ అనిల్ వివిధ  సంఘాలతో వేసిన భేటీలు ఆసక్తిని రేపాయి. ఆయన పార్టీని పెడుతున్నట్లుగా వచ్చిన ప్రచారం కలకలమే రేపింది. అయితే దాన్ని ఆయన కొట్టి పారేశారు. ఇపుడు విశాఖలో బ్రదర్ ప్రత్యక్షం అయ్యారు. విశాఖలోని ఒక హొటల్ లో వివిధ సంఘాలకు చెందిన నేతలతో ఆయన సమావేశాన్ని రెండు గంటల పాటు నిర్వహించారు.
Read more!

దాంతో పొలిటికల్ గా ఇది హాట్ టాపిక్ అయింది. విజయవాడ మీటింగ్ తరువాత జగన్ పాలనలో క్రైస్తవులు, బీసీలు, మైనారిటీలు అసంతృప్తిగా ఉన్నారని సంచలన కామెంట్స్ చేసిన బ్రదర్ అనిల్ ఇపుడు ఏ రకమైన ప్రకటనలు చేస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారుతోంది. ఇంకో వైపు చూస్తే ఆయన కొత్త పార్టీ పెట్టే దిశగానే ఆలోచనలు చేస్తున్నారా అన్న సందేహాలు అయితే అందరిలో ఉన్నాయి.

బ్రదర్ వివిధ వర్గాలతో సమావేశాలు జరుపుతున్నపుడు వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి బ్రదర్ అనిల్ దూకుడు వైసీపీకి బిగ్ ట్రబుల్ గా మారుతుందా అన్నదే ఆ పార్టీలో చర్చగా ఉంది. చూడాలి మరి. ఎం జరుగుతుందో.
Tags:    

Similar News