అదేందో కష్టాలన్ని కట్టకట్టుకొని వచ్చినట్లు జగన్ కే రావాలా?

Update: 2022-05-23 05:37 GMT
అదేమిటో కానీ కష్టాలన్ని కట్టకట్టుకొని వచ్చి పడినట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి మీదనే పడిపోతున్న పరిస్థితి. వెళ్లక.. వెళ్లక విదేశీ పర్యటనకు వెళ్లిన వేళ.. ఆయనకు వచ్చి పడిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. అధికారిక కార్యక్రమంలో భాగంగా దావోస్ కు వెళ్లిన ఆయన.. షెడ్యూల్ ప్రకారం గన్నవరం నుంచి ఇస్తాంబుల్ కు వెళ్లి.. దావోస్ కు వెళ్లాల్సి ఉంది. కానీ.. ఆయన ప్రయాణించిన ప్రత్యేక విమానానికి వచ్చి పడిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.

దావోస్ కు వెళ్లాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. లండన్ కు వెళ్లిన విషయం కొన్ని మీడియా సంస్థల్లో ప్రముఖంగా ప్రచురితం కావటం.. ఆ వెంటనే సోషల్ మీడియాలో సాగిన ప్రచారం జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేయటానికి రంగంలోకి దిగిన మంత్రులు పరస్పర భిన్న వాదనల పుణ్యమా అని.. మరింత రచ్చ అయ్యిందే కానీ.. నష్ట నివారణ జరగలేదు. ఇంతకూ దావోస్ (జురెక్) కు వెళ్లాల్సిన ముఖ్యమంత్రి లండన్ కు ఎందుకు వెళ్లారన్న దానికి అధికార పార్టీ నుంచి వచ్చిన వివరణ చూసినప్పుడు.. కష్టాలన్ని జగన్ మీద దండయాత్ర చేయటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

గన్నవరం నుంచి జురెక్ కు బయలుదేరిన సీఎం జగన్.. అనుకున్న సమయానికి వెళ్లలేకపోయారు. దీనికి కారణం టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో ఫ్యూయల్ నింపుకొని వెళ్లే సమయంలో ఆలస్యం కావటమేనని చెబుతున్నారు. ఇస్తాంబుల్ లో జగన్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ల్యాండ్ కావటం.. అక్కడ ఫ్యూయల్ నింపుకోవటంలో జరిగిన ఆలస్యంతో జురెక్ లో రాత్రి 10 గంటల వేళకు చేరుకునే పరిస్థితి.

ఆ సమయంలో జురెక్ లో విమానాలు ల్యాండ్ కావటానికి పరిష్మన్ లేకపోవటంతో లండన్ వెళ్లినట్లుగా చెబుతున్నారు. అయితే.. టీడీపీ నేతలు మాత్రం జురెక్ లో రాత్రి 10 గంటల తర్వాత ల్యాండ్ అయిన విమానాల చిట్టాను విడుదల చేయటంతో మంత్రి బుగ్గన మాటలు తేలిపోయేలా చేశాయి.

అయినా.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక పర్యటనకు బయలుదేరినప్పుడు.. ఇస్తాంబుల్ లో ఫ్యూయల్ నింపుకోవటానికి ఆలస్యం కావటం ఏమిటన్నది ప్రాథమిక ప్రశ్న. ప్లాన్ ఏ అనుకున్నట్లు సాగకుంటే.. ప్లాన్ బి సిద్ధంగా ఉంటుంది కదా? అలా ఎందుకు జరగలేదన్నది ప్రశ్న.

లండన్ లో ల్యాండ్ అయిన జగన్.. అనంతరం జురెక్ కు వచ్చి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దావోస్ కు చేరుకున్నారు. ఏమైనా.. పవర్ ఫుల్ ముఖ్యమంత్రుల్లో ఒకరిగా చెప్పే సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఎదురైన అనుభవాలు దేనికి నిదర్శనం? ఎక్కడ సమన్వయ లోపం జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏపీ రాష్ట్ర సీఎంగా ఉన్న వేళలో చంద్రబాబు ఎన్నో విదేశీ పర్యటనలు జరిపారు కానీ.. ఎప్పుడూ ఇలాంటి సిత్రాలు చోటు చేసుకోలేదన్న టీడీపీ నేతల మాటలకు వైసీపీ నేతలు సరైన సమాదానం చెప్పలేకపోతున్నారనే చెప్పాలి.
Tags:    

Similar News