పెద్ద నోట్ల ర‌ద్దు...పెరిగిన విదేశీ టూర్లు...

Update: 2017-10-24 05:16 GMT
అవినీతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యం - నల్లధనాన్ని వెలికితీయడం ఉద్దేశంగా పెద్దనోట్లను రద్దు చేశామని చెబుతున్న ప్రభుత్వ లక్ష్యాలు ఏమేరకు నెరవేరాయో తెలీదు కానీ - దాని తర్వాత భారతీయ సంపన్నులు మాత్రం ఎడాపెడా విదేశాలను చుట్టేశారు. ఫారిన్ టూర్ల ఖర్చు సగటున నెలకు ఏకంగా 500శాతానికి పైగా పెరిగినట్లు మనీకంట్రోల్ న్యూస్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. మరో పక్షం రోజుల్లో పెద్దనోట్ల రద్దుకు ఏడాది పూర్తికానుండగా.. వెల్లడించని ఆస్తుల్ని కొందరు ధనవంతులు ఇలా పర్యటనల్లో ఖర్చు చేశారా? లేక విదేశీ టూర్ల సాకుతో అడ్డదారిలో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత విదేశీ టూర్లకు వెళ్లిన వారి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

గత ఏడాది నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే. దాని తర్వాత అదే నెలలో భారతీయులు చేసిన విదేశీ టూర్ల ఖర్చు 246.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1652 కోట్లు). అంతకుముందు ఏడాది నవంబర్ నెలతో పోలిస్తే ఇది 581శాతం పెరిగింది. 2016 డిసెంబర్ నెలలోనూ భారతీయ ధనవంతుల ఫారిన్ టూర్ల సందడి కొనసాగింది. ఆ నెలలో 201 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1347 కోట్లు) విదేశీ పర్యటనల్లో ఖర్చు చేశారు. 2015 డిసెంబర్ గణాంకాలతో పోలిస్తే ఇది 517శాతం ఎక్కువ. తర్వాతి నెలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2017 జనవరిలో 434శాతం వృద్ధితో 217.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1459కోట్లు) ఖర్చుచేయడం గమనార్హం. విచిత్రంగా - ఫిబ్రవరి నెలకు వచ్చేసరికి ఈ విదేశీ పర్యటనల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయితే మార్చి-2017 తర్వాత ఈ టూర్ల ఖర్చు ఎలా ఉందన్న వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఇంకా వెల్లడించలేదు. నోట్ల రద్దు ప్రకటన సమయంలో ప్రభుత్వం పాత కరెన్సీ మార్పిడికి మూడునెలల గడువు ఇచ్చింది. ఇదే సమయంలో సంపన్నులు విదేశాల బాట పట్టడం ఆసక్తికరంగా మారింది. లెక్కచూపలేని డబ్బును ఇలా టూర్ల పేరుతో ఊదిపారేసినట్లు అర్థమవుతోంద‌ని అంటున్నారు. చాలామంది వ్యక్తిగత ఆదాయాలేవీ లేనట్లు వెల్లడించిన వివరాలకు, వారు చేసిన విదేశీ పర్యటనలకు లంకె కుదరడం లేదని ఐటీ అధికారులు చెబుతున్నారు.

రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సరళీకృత విదేశీద్రవ్య చెల్లింపుల పథకం(ఎల్‌ ఆర్‌ ఎస్) ప్రకారం.. ఏడాది కాలంలో 2.5లక్షల డాలర్ల వరకు విదేశాల్లో ఖర్చుచేయవచ్చు. ముందస్తు అనుమతులేవీ లేకపోయినా ట్రావెలర్ చెక్కుల రూపంలో వాటిని ఖర్చుచేసేందుకు ఆర్బీఐ అనుమతిస్తుంది. పెద్దనోట్ల రద్దు ప్రకటన తర్వాత భారతీయులు నిజంగానే ఈ ఎల్‌ ఆర్‌ ఎస్ మార్గంలో విదేశీ పర్యటనలు చేశారా? లేక అలా టూర్లలో ఖర్చు చేసినట్లు చూపించి డబ్బును దారి మళ్లించారా? అన్న కోణంలో అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే పన్ను ఎగవేసేందుకు డబ్బును మళ్లించిన మార్గాలను అధికారులు ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు. కొన్ని కేసుల్లో ఖాతాదారులు తమ అకౌంట్లలో భారీ మొత్తాలను డిపాజిట్ చేసి, తర్వాత వాటిని ఫారిన్ కంట్రీ ట్రావెలర్స్ చెక్కుల రూపంలో డ్రా చేసినట్లు స్పష్టమైంది. 2016 నవంబర్ - డిసెంబర్ రికార్డులను బట్టి చూస్తే మరో విషయం కూడా స్పష్టమవుతోంది. లక్ష రూపాయలకు మించి క్రెడిట్ కార్డు ద్వారా నగదు చెల్లింపులు కూడా గణనీయంగా పెరిగినట్లు తేలింది. మొత్తంగా మోడీజీ చేస్తున్న పెద్ద నోట్ల అనుకూల ప్రచారం సామాన్యులు మాత్రం గుర్రుగా ఉన్నార‌ని అంటున్నారు.
Tags:    

Similar News