ఐటీ చెల్లింపుదారులకు గుడ్ న్యూస్!

Update: 2020-07-05 05:30 GMT
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. కరోనా లాక్ డౌన్ తో ఆదాయం లేక ఆపసోపాలు పడుతున్న ఉద్యోగులు, ప్రజల బాధలు అర్థం చేసుకున్న కేంద్రం తాజాగా వారికి గుడ్ న్యూస్ చెప్పింది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించిన ఐటీ రిటర్నుల దాఖలు చేసే గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆదాయపన్నుశాఖ ప్రకటించింది. రెండు రోజుల క్రితమే ఐటీ రిటర్న్ ల గడువును ఈనెల 31కి పెంచిన కేంద్రం తాజాగా మరో 4 నెలలు అవకాశం ఇచ్చింది.

టీడీఎస్, టీసీఎస్ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ఆఖరు తేదిని కూడా ఐటీ శాఖ ఆగస్టు 15 దాకా పెంచింది.  ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా నవంబర్ 30దాకా రిటర్న్ ల దాఖలుకు అవకాశం కల్పిస్తున్నామని ఐటీశాఖ వెల్లడించింది.

ఐటీ కడుతున్నప్పుడు హౌసింగ్ లోన్లు, జీవిత భీమా, పీపీఎఫ్ ఇతరత్రా మినహాయింపులను క్లెయిమ్ చేసుకొనే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.. వీటి కింద ఈనెల 31వ తేదీదాకా చేసిన అన్ని రకాల ముదుపులను 2019-20 రిటర్నులలో క్లెయిమ్ చేసుకోవచ్చు.
Tags:    

Similar News