తన తనయ ఓడితే - తప్పంతా ఈవీఎంలదేనట!

Update: 2019-05-03 06:16 GMT
ప్రజలను మరీ వెర్రివాళ్లుగా చేసి మాట్లాడుతూ ఉన్నారు రాజకీయ నేతలు. తమ అవకాశ వాదం, తమ అవసరాలకు తగ్గట్టుగా వీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు కాస్తైనా ఆలోచన  శక్తి లేదు అనేది ఈ రాజకీయ నేతల భావనగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ చేసిన వ్యాఖ్య అలానే ఉంది.

ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో శరద్ పవార్ ఈవీఎంల గురించి కామెంట్ చేశారు. ఆయన మాట తీరు ఎలా ఉందంటే..తమ వాళ్లు గెలిస్తే ఈవీఎంలు మంచివి అని,  తమ వాళ్లు ఓడిపోతే ఈవీఎంలు చెడ్డవి అన్నట్టుగా పవార్ మాట్లాడారు. తన కూతురు విజయావకాశాల గురించి పవార్ ఇలా మాట్లాడారు.

మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం నుంచి పవార్ కూతురు సుప్రియ ఎంపీగా పోటీలో ఉన్నారు. ఆమె ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందన్నట్టుగా పవార్ ధీమా వ్యక్తం చేశారు. అంతటి ఆయన ఆగలేదు. తన కూతురు ఈ ఎన్నికల్లో గనుక ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపర్ అయినట్టుగా ఆయన వ్యాఖ్యానించారు!

తన కూతురు ఓడిపోతే ఈవీఎంలను శంకించాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇదీ రాజకీయ నేతల తీరు. వాళ్లు గెలిస్తేనేమో ఈవీఎంలు మంచివి - వీళ్లు ఓడితే మాత్రం ఈవీఎంలు చెడ్డవి… ఇప్పటికే ఈవీఎంల మీద పెద్ద రచ్చ జరుగుతూ ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈవీఎంల విషయంలో రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.

బాబు ఓటమి భయంతోనే ఈవీఎంల మీద నెపాన్ని నెడుతున్నారనే టాక్ వినిపిస్తూ ఉంది. ఇప్పుడు శరద్ పవార్ వ్యాఖ్యలు కూడా అదే విధంగా ఉన్నాయి. గెలిస్తే ఓకే - ఓడితే  మాత్రం ఈవీఎంలదే తప్పు అని వీరు ఫలితాల ముందే వ్యాఖ్యానిస్తూ తమ తీరును చాటుకుంటున్నారు!

   

Tags:    

Similar News