కాంగ్రెస్ ఉత్సాహం నీరుగారిపోయింది

Update: 2017-12-25 06:30 GMT
ఇటీవ‌లి కాలంలో ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో జోష్‌ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆ ఉత్సాహానికి బ్రేక్ ప‌డింది. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున బ‌ల‌ప‌డ‌టం - 2జీ తీర్పుతో ఉత్సాహం రావ‌డం - ఆద‌ర్శ్ కేసులో మాజీ సీఎం చ‌వాన్‌ కు ఉప‌శ‌మ‌నం ద‌క్క‌డం వంటివి ఆ పార్టీ నేత‌ల్లో ఉత్సాహం నింపింది. అయితే తాజాగా దేశంలోని నాలుగు రాష్ర్టాల పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వెనుకబడింది. అధికార‌ - ప్ర‌తిప‌క్షాలు - స్వ‌తంత్ర అభ్య‌ర్థి కంటే కూడా కాంగ్రెస్ వెనుకంజలో ఉంది.

తమిళనాడులోని ఆర్‌కే నగర్ స్థానంలో ఏఐఏడీఎంకే తిరుగుబాటు నేత టీటీవీ దినకరన్ చారిత్రక విజయం సాధించారు. ఇక్క‌డ కాంగ్రెస్‌కు అతి త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి. పశ్చిమబెంగాల్ - అరుణాచల్ ప్రదేశ్‌ ల్లోని మూడు సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అరుణాచల్‌ లో రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుచుకున్న బీజేపీ.. ఉత్తరప్రదేశ్‌ లోని సికంద్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ నెల 21న ఈ స్థానాలకు పోలింగ్ జరుగగా ఆదివారం ఓట్లు లెక్కించారు. పశ్చిమబెంగాల్‌ లోని సబాంగ్ స్థానంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి గీతారాణి భూనియా తన సీపీఎం ప్రత్యర్థి రీటా మండల్‌ పై 64 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుచుకున్నారు. అధికార తృణమూల్ అరాచకాలకు పాల్పడిందని కాంగ్రెస్ - సీపీఎం ఆరోపించాయి.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దిహాత్ జిల్లా సికంద్రా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అజిత్ సింగ్ పాల్ 11,861 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఏడాది ప్రారంభంలో కలిసి పోటీ చేసిన ఎస్పీ - కాంగ్రెస్.. ఉప ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ఈవీఎంల సీళ్లు తొలిగించారని ఎస్పీ - కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఆరోపించడంతో ఒకింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని పక్కే - కెస్సాంగ్ - లికాబాలీ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. పక్కే - కెస్సాంగ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి బీఆర్ వాఘే తన కాంగ్రెస్ ప్రత్యర్థి కమెంగ్ డోలోపై కేవలం 475 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. లికాబాలీ స్థానంలో బీజేపీ అభ్యర్థి కార్డో న్యైగ్యోర్ - తన పీపీఏ ప్రత్యర్థి గుమ్కే రిబాపై 305 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
Tags:    

Similar News