బీజేపీ నేతలు కతలు వినిపిస్తున్నారా ?

Update: 2022-10-01 05:29 GMT
నోటికొచ్చిన కతలు చెప్పి రోజులు వెళ్ళదీయటానికి బీజేపీ నేతలు బాగా అలవాటుపడిపోయారు. రెండు మూడు నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరుగుతాయని, అవి చూసి అందరు ఆశ్చర్యపోతారని ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కాకినాడ జిల్లా పర్యటనలో చెప్పారు.

ఇలాంటి ప్రకటనే రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు కూడా చెప్పారు. నెలరోజుల క్రితం మీడియాలో వీర్రాజు మాట్లాడుతూ రెండు నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చూస్తారంటు కొద్దిరోజులు ఒకటే ఊదరగొట్టారు.

వీళ్ళు చెప్పేంత స్ధాయిలో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు వచ్చే అవకాశాలు ఏమీ కనబడటం లేదు. ఇపుడు మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-జనసేన ఏదో పేరుకు మాత్రమే ఉన్నాయి. రెండు పార్టీలు కలిసి ఒక్కటంటే ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు. వీటితో మిత్రపక్షంగా కలవాలని చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదు. మహా అయితే కమలనాథులు చెప్పే రాజకీయ సమీకరణలేమిటంటే వీళ్ళకు టీడీపీ కూడా మిత్రపక్షంగా కలవచ్చంతే.

కానీ టీడీపీతో పొత్తు ఉండదంటు బీజేపీ సీనియర్లలో కొందరు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. సరే ఇపుడు ఏమి చెప్పినా ఎన్నికల నాటికి పొత్తు కుదిరితే కుదరచ్చు. అంతేకానీ జనాలందరు ఆశ్చర్యపోయేంత స్ధాయిలో మారిపోయే రాజకీయ సమీకరణలు ఏముండబోతున్నాయో అర్ధం కావటంలేదు.

ఒకవేళ వైసీపీ ఏమన్నా ఎన్డీయేలో చేరుతుందా ? అంటే దానికి అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అదీకాదంటే బీజేపీ-జనసేనలు విడిపోవాలి. రెండు పార్టీలు విడిపోతాయని  జనాలందరు ఎప్పటినుండో ఊహిస్తున్నదే. టీడీపీ-జనసేన పొత్తుపెట్టుకుని పోటీచేస్తాయనే ప్రచారం కొత్తేమీకాదు.

ఇలా ఏరకంగా చూసినా అనూహ్య పరిణామాలు జరిగే అవకాశాలు దాదాపు కనబడటంలేదు. విభజన హామీలు నెరవేర్చే ఉద్దేశ్యం నరేంద్ర మోడీ సర్కార్ కు ఎలాగూ లేదని ఎప్పుడో తేలిపోయింది. ఇంక రాజకీయ సమీకరణల మార్పుతో జరగబోయే చిత్రవిచిత్రాలేముంటాయి ? జూనియర్ ఎన్టీయార్ ఏమన్నా బీజేపీకి సేవలందిస్తారా ? ఇదే సంచలనమా? ఎందుకంటే ఇప్పటికే ఈ విషయమై అనేక వార్తలు, కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏమో గుర్రం ఎగరావచ్చు? అంటున్నారు బీజేపీ వాళ్లు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News