ఉత్తరప్రదేశ్ అత్యధిక జీఎస్టీ వెనుక అసలు కథ..?
దేశంలో జీఎస్టీ వసూళ్లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల జాబితాలో ఇటీవల ఉత్తరప్రదేశ్ (యూపీ) పేరు వినిపిస్తోంది.;
దేశంలో జీఎస్టీ వసూళ్లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల జాబితాలో ఇటీవల ఉత్తరప్రదేశ్ (యూపీ) పేరు వినిపిస్తోంది. దీనిని చూసి యూపీ దేశంలోనే అతిపెద్ద పన్ను చెల్లించే రాష్ట్రం అని అనుకునే వారు చాలామందే ఉన్నారు. కానీ అసలు వాస్తవం కొంచెం భిన్నంగా ఉంది.
మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలే దేశంలో ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు, పారిశ్రామిక హబ్లు. వీటిలోనే అతిపెద్ద పన్ను చెల్లింపుదారులు, కార్పొరేట్ దిగ్గజాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ యూపీ అంత స్థాయి ఉత్పత్తి లేదా పారిశ్రామిక శక్తి కలిగిన రాష్ట్రం కాదు. అయినా జీఎస్టీ వసూళ్లలో యూపీ ఎలాగు ముందువరుసలో ఉంది?
దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అందించే వేల కోట్ల గ్రాంట్లు. యూపీకి కేంద్రం నుండి వివిధ పథకాల కింద, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారీ మొత్తంలో నిధులు వస్తుంటాయి. ఈ నిధులు రాష్ట్ర ఖజానాలోకి వచ్చిన తరువాత, వాటి వినియోగ ప్రక్రియలో వస్తువులు, సేవలు కొనుగోలు చేస్తే జీఎస్టీ రూపంలో రాబడి నమోదవుతుంది. అంటే, ఈ ఆదాయం ప్రజల నుండి లేదా వ్యాపార రంగం నుండి స్వతహాగా వచ్చే పన్ను కాదు.. కేంద్ర నిధుల వినియోగం వల్లే జీఎస్టీ గణాంకాలు పెరుగుతున్నాయి.
ఇది ఒక రకంగా “గ్రాస్ ఎఫెక్ట్” అంటే, కేంద్రం ఇచ్చిన మొత్తాన్ని ఖర్చు చేసే సమయంలో ఏర్పడే పన్ను వసూళ్లు. ఈ కారణంగా యూపీ జీఎస్టీ గణాంకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి, మహారాష్ట్ర, గుజరాత్, దక్షిణ రాష్ట్రాలే నిజమైన పెద్ద పన్ను చెల్లింపుదారులు, ఎందుకంటే అక్కడి పరిశ్రమలు, వ్యాపారాలు స్వయంగా కేంద్రానికి , రాష్ట్రానికి పన్నులు చెల్లిస్తున్నాయి.
మొత్తానికి, ఉత్తరప్రదేశ్ జీఎస్టీ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో కనిపించడం, అక్కడి ప్రజలు లేదా పరిశ్రమలు అధిక పన్నులు చెల్లిస్తున్నందుకు కాదు. ఇది ఎక్కువగా కేంద్రం ఇచ్చే గ్రాంట్ల ఆర్థిక ప్రభావం వల్లే సాధ్యమవుతోంది.