యూత్ సెంట్రిక్గా ఈ సారి మహానాడు స్పెషల్స్ ఇవే.. !
తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ ఈనెల ఆఖరిలో జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా వడివడిగా సాగుతున్నాయి.;
తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ ఈనెల ఆఖరిలో జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా వడివడిగా సాగుతున్నాయి. ఈ సారి ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం ఇస్తూ.. శ్రీకాకుళం జిల్లాలో మహానాడు నిర్వహించాలన్నది టిడిపి ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో ఇప్పటికే ఏర్పాట్లు కూడా వడివడిగా సాగుతున్నాయి. అయితే ఈ మహానాడుకు చాలా ప్రత్యేకత ఉంది. టిడిపిలో ఇప్పటివరకు జరిగిన మహానాడులు వేరు. ఇప్పుడు జరుగుతున్న మహానాడు వేరు అనేది పార్టీలో నాయకులు చెబుతున్నారు.
ఈ దఫా యువనాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మహానాడులో ఈసారి మొత్తం నారా లోకేష్ ప్రభావం కనిపిస్తుందని అదేవిధంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన యువనాయకత్వానికి ఎక్కువ అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఈసారి విధానపరమైన నిర్ణయాలు పార్టీ పరంగా భవిష్యత్తు వ్యవహారాలు వంటి అంశాల్లో కీలకమైన అంశాలను నారా లోకేష్ నేతృత్వంలోని కమిటీ కి అప్ప చెబుతారని సమాచారం. ముఖ్యంగా.. పార్టీ భవిష్యత్తు వ్యూహాలు ఈ దఫా యువతను టార్గెట్గా చేసుకొని ఉంటాయని కూడా అంటున్నారు.
అయితే ఇవన్నీ పర్యవేక్షించేందుకు, పరిశీలించేందుకు లోకేష్ నేతృత్వంలో మహానాడు వేదికగా ఒక కమిటీ ఏర్పాటు అవుతుందని కూడా సమాచారం. అదేవిధంగా ఈ దఫా మహానాడులో యువత ఎక్కువగా ప్రసంగించేలా వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా కూడా వ్యవహరిస్తున్నారన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. భవిష్యత్తు అంతా యువనాయకత్వానిదే కాబట్టి ఈసారి మార్గదర్శకానికి మాత్రమే సీనియర్లు పరిమితం కానున్నారు. యువతకు ఎక్కువ అవకాశం కల్పించడం ద్వారా వారి ఆలోచనలను పంచుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.
ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించాలి అనేది టిడిపి లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ పరంగా ఎలా ఉన్నప్పటికీ యువతకు మెజారిటీ అవకాశాలు కల్పించాలని మహానాడు నిర్దేశిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏం జరుగుతుందనేది చూడాలి. ప్రస్తుతానికైతే మహానాడు వేదికగా యువతకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆమెరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి యువతకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్న దరిమిలా.. ఈ మేరకు మహానాడుతోనే శ్రీకారం చుట్టనున్నారని సీనియర్లు చెబుతున్నారు.