కోదండ రామ్కు ఛాన్స్ దక్కేనా? రేవంత్ నిర్ణయం ఏంటి?
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను ఎంపిక చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందీ లేదని.. దీనికి తాము అడ్డు చెప్పలేదని సుప్రీంకోర్టు మంగళవారం నాటి ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.;
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను ఎంపిక చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందీ లేదని.. దీనికి తాము అడ్డు చెప్పలేదని సుప్రీంకోర్టు మంగళవారం నాటి ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీని ప్రకారం.. ఎంపిక ప్రక్రియను ప్రారంభించుకునే అవకాశం సర్కారుకు ఏర్పడింది. వాస్తవానికి.. గత బీఆర్ ఎస్ హయాంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరు నాయకులను సిఫార్సు చేశారు. కానీ, అప్పటి గవర్నర్ ఈ నియామకాలను తొక్కిపెట్టారు.
నాడు బీఆర్ ఎస్ హయాంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్ కోటాలో మండలికి పంపించే ప్రయత్నం చేశా రు. అయితే.. అప్పటి గవర్నర్ తమిళిసై ఈ అభ్యర్థనలను తిరస్కరించారు. ఇంతలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం.. ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్టు అమిర్ అలీఖాన్లను సిఫారసు చేసింది. అయితే.. ఈ వ్యవహారంపై దాసోజుశ్రవణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. గత ఏడాది ఆగస్టులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం తుది తీర్పునకు లోబడి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను ఎంపిక చేయొచ్చని తెలిపింది.
అయితే.. ఈ కేసు విచారణ ముందుకు సాగకపోవడంతో ఏదో ఒకటి తేల్చాలని.. కోరుతూ.. అమీర్ అలీఖాన్ ప్రత్యేక పిటిషన్ వేశారు. దీనిపై తాజాగా విచారణజరిపిన సుప్రీంకోర్టు.. కొత్తగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను ఎంపిక చేసుకునేందుకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఎలాంటి అడ్డంకీ కాబోవని తేల్చి చెప్పింది. ఇదేసమయంలో రాష్ట్ర మంత్రి వర్గం సిఫారసు చేసిన అభ్యర్థులను గవర్నర్ ఆమోదించవచ్చని తేల్చి చెప్పింది. అంటే.. గతంలో ఇచ్చిన.. `తుది తీర్పునకు లోబడి` అనే క్లాజును తాజాగా ఎత్తేసిం ది. ఫలితంగా కొత్తగా ఇద్దరు సభ్యులను ఎంపిక చేసుకునే ఛాన్స్ ఏర్పడింది.
ఎవరికి ఛాన్స్?
ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులను మండలికిపంపించే అవకాశం రేవంత్ రెడ్డి సర్కారుకు ఏర్పడింది. అయితే.. ఇప్పటికే అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్న దరిమిలా.. ఆయనకు ఒక సీటును ఇచ్చే ప్రతిపాదన ఖచ్చితంగా ఉంటుందన్న చర్చ సాగుతోం ది. ఇదే సమయంలో మరోసీటుకు మళ్లీ ప్రొఫెసర్ కోదండరామ్ను ఎంపిక చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే కోదండరామ్కు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యానికి తోడు.. ఉద్యమ వీరులను గత సర్కారు అవమానించిందన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో కొదండరామ్కు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా బీఆర్ ఎస్కు షాక్ ఇవ్వాలన్న ఆలోచన చేయొచ్చని తెలిసింది.