టీడీపీలో చేరిన పోసాని ఫ్యామిలీ మెంబర్.. కామెంట్స్ వైరల్!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి.. ఎన్నికల నేపథ్యంలో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి.

Update: 2024-04-29 11:15 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి.. ఎన్నికల నేపథ్యంలో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఒకపక్క నామినేషన్ల పర్వం ముగియడం.. మరోపక్క ఎన్నికల పోలింగ్ తేదీకి కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ప్రచార కార్యక్రమాలు హోరెత్తిపోతున్నాయి. ఇదే సమయంలో విమర్శలు ప్రతి విమర్శలతో పాటు.. సరికొత్త వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి.

ఈ సమయంలో.. వైసీపీ కీలక నేత, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి కుటుంబ సభ్యుడు ఒకరు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడం ఆసక్తిగా మారింది. ఒకపక్క చంద్రబాబు పేరు చెబితే... పోసాని కృష్ణ మురళి ఎంత ఎత్తున ఎగిరిపడతారనఏది తెలిసిన విషయమే. జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు చేసిన వెంటనే... మైకుల ముందుకు వచ్చే పోసాని.. ఆ విమర్శలు చేసిన వారిని చెడుగుడు ఆడేస్తారు!

అయితే అనూహ్యంగా పోసని కుటుంబ సభ్యుడు ఒకరు తాజాగా టీడీపీలో చేరడం ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా... కృష్ణమురళి సోదరుడి కుమారుడు పోసాని యోగేంద్రనాథ్.. తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మెరకు అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రూ.20 ల‌క్షల పార్టీ ఫండ్‌ ను కూడా యోగేంద్రనాథ్ అందించారని తెలుస్తోంది!

ఈ క్రమంలో... పార్టీలో చేరిన అనంతరం స్పందించిన యోగేంద్రనాథ్... చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని.. ఆయన ముందుచూపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. ఇదే సమయంలో.. తనకు ఆయన ఆశయాలు నచ్చడం వల్లే టీడీపీలో చేరినట్లు వివరించారు. టీడీపీలో చేరడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు.

Read more!

ఈ నేపథ్యంలో... ఈ ఎన్నిక‌ల్లో చిల‌క‌లూరిపేట‌ స‌హా గుంటూరు, న‌ర‌సారావుప‌పేట నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రచారం చేస్తాన‌ని కూడా యోగేంద్రనాథ్ చెప్పారు! మరి ఈ విషయంపై పోసాని కృష్ణమురళి ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి! కాగా... బ్రిటన్‌ లో వ్యాపారవేత్తగా కొనసాగుతున్న యోగేంద్రనాథ్.. తన వ్యాపారాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నారని తెలుస్తుంది! చంద్రబాబు హ‌యాంలో హైద‌రాబాద్‌ లోనూ ఆయన వ్యాపారాలు ప్రారంభించారని అంటున్నారు!

Tags:    

Similar News