చంద్రబాబు మనవడిపై మాజీ మంత్రి పేర్ని సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్

ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ విషయమై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-05-30 07:00 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ విషయమై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మహానాడులో ఆ పార్టీ నేతలు భజన తప్ప ప్రజా సమస్యలు కనీసం పట్టించుకోలేదని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వైసీపీ పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశంలో మాట్లాడిన పేర్ని మహానాడులో ఓ టీడీపీ నేత దేవాన్ష్ పై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.

‘‘దేవాన్ష్ కళ్ల జోడు తీసేస్తే అచ్చు ఎన్టీఆర్ లా ఉంటాడని ఎవరో చెప్పారు. దేవాన్ష్ కళ్ల జోడు తీసేస్తే చంద్రబాబు మాదిరిగానో లేకపోతే ఆయన తండ్రి ఖర్జూరనాయుడులా కనిపించాలి కానీ, ఎన్టీఆర్ లా కనిపించడమేంటి’’ అంటూ పేర్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి పేర్ని మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. టీడీపీ మహానాడులో దిగిపో దిగిపో చందన్న.. ఎక్కిపో ఎక్కిపో లోకేశా అంటూ భజన చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.

మహానాడులో టీడీపీ నేతల ప్రసంగాలపై పలు సెటైర్లు పేల్చారు పేర్ని నాని. జయము జయము చంద్రన్న అని పాటలు పాడారని, ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి సాధారణ నేతలు వరకు అందరూ భజనకే పరిమితమయ్యారని మాజీ మంత్రి పేర్ని విమర్శించారు. ఈ క్రమంలోనే టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్ యువనేత లోకేశ్ కుమారుడు దేవాన్ష్ కోసం చేసిన వ్యాఖ్యలను పేర్ని ప్రస్తావించారు. దేవాన్ష్ కు ఎన్టీఆర్ పోలికలు ఎందుకు వస్తాయంటూ పేర్ని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా అవుతున్నాయి.

ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు వేడుకగా నిర్వహించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సూచించిన పొదుపు చర్యల్లో భాగంగా మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించగా, రాష్ట్రవ్యాప్తంగా కేడర్ వర్చువల్ గా పాల్గొని విజయవంతం చేశారని టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. దీనిపై వైసీపీ నేత పేర్ని స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహానాడులో పాల్గొన్న టీడీపీ నేతలు ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యలపై చర్చించలేదని, చంద్రబాబు, లోకేశ్ భజనకే పరిమితమయ్యారని ఆరోపించారు. ఇదే సమయంలో రాజకీయాలకు సంబంధం లేని మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ పై పేర్ని సంచలన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.



Tags:    

Similar News