నోరుందని వాగితే.. చర్యలు తప్పవు: పవన్ వార్నింగ్
నోరుందని ఇష్టానుసారం వాగితే.. చర్యలు తప్పవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
నోరుందని ఇష్టానుసారం వాగితే.. చర్యలు తప్పవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించారు. భావప్రకటనా స్వేచ్ఛ, వాక్స్వాతంత్ర్యం అనేవి రాజ్యాంగం ఇచ్చిన హక్కలేనని అయితే.. ఇవి అపరిమిత హక్కులు కావని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సహా.. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా మాట్లాడే హక్కు తనతో పాటు ఎవరికీ లేదన్నారు. ఎవరిపై బడితే వారితో నోరు చేసుకుంటే చట్టాలు చూస్తూ ఊరుకోవని అన్నారు.
తాజాగా వాక్ స్వాతంత్ర్యం, సోషల్ మీడియాదుర్వినియోగంపై ఆయన వీడియో విడుదల చేశారు. సమాజంలో తమ అభిప్రాయాలు చెప్పుకొనే స్వేచ్ఛ ఉంటుందని.. దీనికి ఎవరూ అడ్డుపడరని అన్నారు. అయితే.. ఎదుటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతిసే హక్కు కూడా ఎవరికీ ఉండదని చెప్పారు. ఈ విషయంలో గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు.. రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందికర పరిణామాలను తీసుకువస్తున్నాయన్నారు. కొందరు మహిళలను కూడా టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఈ హక్కు ఎవరు ఇవ్వారని ప్రశ్నించారు.
రాజ్యాంగంపైనా దాడి చేస్తున్నారని, రాజ్యాంగ పరిధుల్లో ఉన్న వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూస్తూ.. చేతులు ముడుచుకుని కూర్చోవడం ప్రభుత్వ పనికాదని , బాధితులకు న్యాయం చేయడం ఎంత అవసరమో.. దారితప్పిన వారిని దారిలో పెట్టడం కూడా ప్రభుత్వ బాధ్యతగా చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కఠిన చర్య లు అవసరమని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ముసుగులో ఎవరిపైనైనా దాడి చేస్తాం.. ఏదైనా వాగేస్తాం.. అంటే కుదరద ని తేల్చి చెప్పారు. ఇక, నుంచి ఈ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తామన్నారు.
తనతో సహా అందరికీ ఇది వర్తిస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసేవారిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిని జనసేన నుంచే ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. జనసేన కార్యాలయంలో ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సోషల్ మీడియా బాధితులకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. వాక్ స్వాతంత్రాన్ని పరిరక్షిస్తూనే.. ఈ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కాపాడతామని అన్నారు.