'టీఆర్ఎస్'తో మాకు నష్టం: 620 పిటిషన్లు!
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పేరును రద్దు చేయాలని.. మరోపేరును కేటాయించాలని కోరుతూ..
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పేరును రద్దు చేయాలని.. మరోపేరును కేటాయించాలని కోరుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం ముందు 620కిపైగా పిటిషన్లు దాఖలయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి. దీనిని టీఆర్ ఎస్ పార్టీ నాయకులు కూడా ధ్రువీకరించారు. ఆయా పిటిషన్ల వ్యవహారం తమ వరకు వచ్చిందని.. ఎవరైతే అభ్యంతరాలు తెలిపారో.. వారికి వివరణ కూడా ఇస్తున్నామని కవిత పార్టీ నాయకులు వెల్లడించారు.
ఎందుకు?
టీఆర్ ఎస్ పేరు అనేది తెలంగాణ సమాజంలో నిగూఢంగా పుంజుకుంది. తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి ఈ పేరు తెలియని వారు.. పలకని వారు లేరంటే ఆశ్చర్యం వేస్తుంది. అలాజనం గుండెల్లో పేరుకుపోయిన టీఆర్ ఎస్ పేరును కవిత తన పార్టీ పేరుగా మార్చుకున్నారు. తొలుత `తెలంగాణ రాష్ట్ర సేన`గా పేరు నిర్ధారించారు. పార్టీ పేరును కూడా ప్రకటించారు. అయితే.. ఎన్నికల సంఘం ఈ పేరును తెలంగాణ రక్షణ సేనగా మార్చింది. దీంతో కవిత సహా.. ఆ పార్టీ నాయకులు కూడా సంబరాలు చేసుకున్నారు. అయితే.. నిబంధనల ప్రకారం.. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు.
ఈ క్రమంలో కేంద్ర ఎ న్నికల సంఘానికి ఇప్పటి వరకు 620కిపైగా అభ్యంతరాలు వచ్చాయని అధికారిక సమాచారం. వీటికి సమాధానం చెప్పిన తర్వాత.. వాటిపై ఫిర్యాదు దారులు సంతృప్తి చెందితే.. అప్పుడు టీఆర్ఎస్ పేరును ఖరారు చేస్తారు. లేకపోతే మరో పేరును సూచించాలని కవితను కోరే అవకాశం ఉంది. ఇక, ఈ పేరు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.. ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులేనని కవిత వర్గం ఆరోపిస్తోంది. వారికి పార్టీపరంగా.. ఓటు బ్యాంకు పరంగా కూడా దడ పట్టుకుందని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. అందుకే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
స్పందించని కవిత..
మరోవైపు..ఈ వ్యవహారంపై కవిత ఇంకా స్పందించలేదు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరాలు వచ్చిన విషయంపై పార్టీ నాయకులు మాట్లాడారు. ఇవన్నీ.. తాము లెక్కచేయబోమని.. పార్టీ పరంగా ముందుకు సాగుతామని అన్నారు. మరోవైపు.. తమ ఓటు బ్యాంకు ఖల్లాస్ అవుతుందన్న ఆవేదన బీఆర్ ఎస్లో కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఈ విషయంలో స్పష్టత రాకపోతే.. ఇక్కడ జరిగే పరిణామాల అనంతరం.. సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశంపై కూడా బీఆర్ఎస్ చర్చిస్తున్నట్టు రాజకీయాల్లో వర్గాలు చెబుతున్నాయి.