ప్రకటనలకు పరిమితం కావొద్దు జనసేనానీ.. !
రాజకీయాల్లో ప్రకటనలు చేయడం పరిపాటి. కానీ.. వాటిని ఆచరణలోకి తీసుకువచ్చి.. అమలయ్యేలా చూడడమే ముఖ్యం.
రాజకీయాల్లో ప్రకటనలు చేయడం పరిపాటి. కానీ.. వాటిని ఆచరణలోకి తీసుకువచ్చి.. అమలయ్యేలా చూడడమే ముఖ్యం. ఇది చేయనంత వరకు ప్రకటనలు ప్రకటనలుగానే మిగిలిపోతాయి. ఈ విషయంలో జనసేన అధినేత.. పవన్ కల్యాణ్ కూడా అతీతమేమీ కాదు. ఆయన కీలక ప్రకటనలు చేస్తున్నారు. వీటిని వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే విషయంలో మాత్రం కొంత మేరకు వెనుకబడుతున్నారనే చెప్పాలి. గతం లో నాయకులను ఎంపిక చేసుకునే విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా యువతకు పరీక్షలు నిర్వహించారు.
కానీ.. ఆ తర్వాత ఈ విషయాన్ని బుట్టదాఖలు చేశారు. ఇక, వీర మహిళల విభాగం ఏర్పాటు చేశారు. మహి ళలకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. కానీ, ఇప్పటి వరకు.. వీర మహిళలు వీరోచితంగా రాజకీయాలు చేస్తున్నారా? అంటే.. తడుముకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక, ఇటీవల పలు కమిటీలను ప్రకటించారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు పెద్ద పీట వేస్తున్నానని ప్రకటించారు. దీనిలో భాగంగానే మూడు విభాగాలను ప్రస్తావించారు.
లక్ష్యదళ్, నిర్వాహక దళ్, పరిపాలక దళ్ పేరుతో మూడు విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే.. ఇది జరిగిన 20 రోజులు అవుతున్నా.. వీటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ కనిపించలేదు. లక్ష్యదళ్ ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. నిర్వాహక దళ్ ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోపాటు.. పార్టీ మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతో వివరిస్తామన్నారు. పరిపాలక దళ్ ద్వారా విధాన పరమైన నిర్ణయాలతోపాటు.. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరిస్తామన్నారు.
తొలుత వీటిని అమలులోకి తీసుకువచ్చి.. పార్టీని గాడిలో పెట్టాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పుడు మరో పేరుతో మరో కమిటీకి శ్రీకారం చుట్టారు. అదే.. సేనా గళం. యువతకు ముఖ్యంగా జెన్-జీకి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇది కూడా మంచిదే.. కానీ.. ఇవి ప్రకటనలకు పరిమితమైతేనే ఇబ్బందులు వస్తాయి. అలా కాకుండా.. వాటిని అమలులోకి తీసుకువ చ్చి.. కార్యాచరణ చేపట్టేలా పనిచేయాలి. ఈ దిశగా అడుగులు వేస్తేనే జనసేనకు మేలు జరుగుతుంది. లేకపోతే.. ప్రచార ఆర్భాటాలే మిగిలిపోతాయి.